శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (10:39 IST)

చనిపోయిన భర్త రాత్రివేళ కలలో కనిపిస్తున్నాడనీ.. భార్య ఆత్మహత్య

చనిపోయిన భర్త రాత్రి వేళల్లో కలలోకి వస్తున్నాడనీ భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణంలోని ఆచార్లకాలనీ, శ్రీనివాసపురానికి చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి ఆర్నెల్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన భార్య శ్రీలక్ష్మి తీవ్ర మనోవేదనతో బాధపడుతూ ఉండేది. రాత్రి వేళల్లో భర్త కలలోకి వస్తున్నాడని, అతను పక్కనే ఉన్నట్లు తనకు అనిపిస్తోందని పిల్లలతో చెప్పుకుంటూ బోరున విలపిస్తూ వచ్చేది.
 
ఈ క్రమంలో ఆమెను కన్నబిడ్డలే ఓదార్చుతూ వచ్చారు. అయితే, ఇంటి పక్కన ఒక మహిళ శనివారం మృతి చెందింది. ఉదయాన్నే ఏడుపులు వినిపిస్తుండటంతో శ్రీలక్ష్మి కూడా నిద్రలేచి చనిపోయిన మహిళ మృతదేహాన్ని కూడా చూసివచ్చింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమోగానీ ఇంట్లోని మరో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఉదయం 6.30 గంటల తర్వాత కుమార్తెలు నిద్రలేచి చూస్తే తల్లి ఉరికంబానికి వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారి బోరున విలపించారు. దీంతో ఇరుగుపొరుగువారు వచ్చి మృతదేహాన్ని కిందికి దించి పోలీసులకు సమచారం చేరవేశారు.
 
ఆర్నేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సుధాకర్, శ్రీలక్ష్మికి ధరణి, చరణి  ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కార్తీక్ ఉన్నాడు. ధరణి బీటెక్, చరణి తొమ్మిది, కుమారుడు ఆరో తరగతి చదువుతున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కుమార్తెలు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది. ఒంటరి వారిని చేసి వెళ్లిపోయారా అంటూ గుండెలు పగిలిలేలా విలపించారు.