శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (09:39 IST)

మోడీ సర్కారుపై వైకాపా అవిశ్వాస అస్త్రం.. టీడీపీ ఏం చేస్తుందో?

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించనుంది.

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో ఉన్న తమ అధినేత జగన్‌తో ఆ పార్టీ ముఖ్యులు, ఎంపీలు శనివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. 
 
నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ వైసీపీకి ఐదుగురు సభ్యులే ఉన్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి సమయం తీసుకొని మార్చి 21న పెట్టాలని వైసీపీ అనుకుంటోంది. లోక్‌సభ 198వ నిబంధనను అనుసరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఈ నిబంధన ప్రకారం 50 మంది ఎంపీలు దానికి మద్దతిస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అంగీకరిస్తారు.
 
అయితే దీనికి వెంటనే సమయం కేటాయించరు. నిబంధనల మేరకు తీర్మానాన్ని అంగీకరించిన 10 పని దినాల్లో ఎప్పుడైనా స్పీకర్‌ చర్చకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 6న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. వైసీపీ మార్చి 21న తీర్మానం పెడితే సరిగ్గా 10వ పనిదినాన సభ ముగుస్తుంది. 
 
ఆర్థిక పద్దులపై చర్చించడంతో పాటు ట్రిపుల్‌ తలాక్‌, ఆర్థిక నేరాల బిల్లు, బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లు వంటి కీలక బిల్లులపై చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో మార్చి 21 తర్వాత సమయాభావం వల్ల అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించకపోవచ్చు. ఈ లెక్కలన్నీ ముందే వేసుకుని అవిశ్వాస తీర్మానం 21న పెట్టాలని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.