జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? కాస్త ఆగండి..!
జ్యూస్లు, కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? కాస్త ఆగండి..! జ్యూస్ - కూల్డ్రింక్స్ మితిమీరి తాగితే మధుమేహం వ్యాధి బారిన పడటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, వీటిని అదే పనిగా తాగే వారు మాత్రమే డయాబెటీస్ బారిన పడే ప్రమాదముందని వారు పేర్కొంటున్నారు.
కానీ ఇప్పటి వరకు చక్కెర వ్యాధి లేనివాళ్ళు నిక్షేపంగా తీపి పానీయాలు తీసుకోవచ్చని చెప్పిన శాస్త్రవేత్తలే ఇప్పుడు వద్దని చెప్పడానికి కారణం లేకపోలేదు. అదేపనిగా కూల్ డ్రింకులు, పళ్ళ రసాలు తాగుతున్న వాళ్ళలో మధుమేహం ముప్పు పొంచి ఉంటోందట. ప్రతి 336 మిల్లీ లీటర్ల తీపి పానీయంతో మధుమేహం ముప్పు 22 శాతం పెరుగుతున్నట్టు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారణ అయినట్టు వారు పేర్కొంటున్నారు.
ఈ పరిశోధనను బ్రిటన్కు చెందిన ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు నిర్వహించారు. ఈ అధ్యయనం పండ్లరసాలు, చక్కెరతో చేసిన కూల్ డ్రింకులు, కృత్రిమ తీపితో చేసిన పానీయాలపై సాగినట్టు వారు పేర్కొన్నారు.