శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (07:07 IST)

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త.. రద్దు ఛార్జీలకు స్వస్తి

ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు పేరెత్తితే ఖాతాదారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు ఖాతా కలిగిన వారు కనీస నిల్వ రూ.5 వేలు ఉంచాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు పేరెత్తితే ఖాతాదారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు ఖాతా కలిగిన వారు కనీస నిల్వ రూ.5 వేలు ఉంచాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పైనా పరిమితులు విధించింది. ఈ పరిమితులు దాటితే అదనపు చార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. దీంతో ఎస్.బి.ఐ పేరెత్తితే ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు. 
 
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తన ఖాతాదారులకు ఎస్.బి.ఐ శుభవార్తలు చెపుతూ వస్తోంది. కనీస నిల్వ మొత్తాన్ని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా తగ్గించింది. తాజాగా మరో మంచివార్త చెప్పింది. కనీసం ఒక ఏడాది నిండిన పొదుపు ఖాతాలను రద్దు చేసుకోవాలంటే ఎటువంటి ఛార్జీలను చెల్లించవలసిన అవసరం లేదని తెలిపింది. ఈ ఆదేశాలు అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 
 
గతంలో సేవింగ్స్ అకౌంట్స్‌ను రద్దు చేసుకోవాలంటే రూ.500, అదనంగా జీఎస్‌టీ వసూలు చేసేవారు. ఖాతాను ప్రారంభించిననాటి నుంచి 14 రోజుల్లోగా రద్దు చేసుకునేవారికి ఈ ఛార్జీలను వసూలు చేసేవారు కాదు. మరణించిన డిపాజిటర్ల ఖాతాలను రద్దు చేసుకోవడానికి విధించే ఛార్జీలను కూడా రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 
 
అదేవిధంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ నిర్వహించే రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను రద్దు చేసుకోవాలన్నా క్లోజర్ ఛార్జీలను వసూలు చేయబోమని పేర్కొంది. అయితే, ఖాతాను ప్రారంభించిననాటి నుంచి 14 రోజులు గడచిన తర్వాత, ఒక ఏడాది పూర్తికాకుండా రద్దు చేసుకోవాలంటే గతంలో మాదిరిగానే రూ.500తోపాటు జీఎస్‌టీని చెల్లించవలసి ఉంటుందని వివరించింది.