శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

విరాట్ కోహ్లీకి అంత సీన్ లేదు: గ్రేమ్ స్మిత్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ పటిమపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. భారత్‌ తరపున అతడు సుదీర్ఘకాలం సారథ్యం వహిస్తాడో లేడో చెప్పలేనన్నారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ పటిమపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. భారత్‌ తరపున అతడు సుదీర్ఘకాలం సారథ్యం వహిస్తాడో లేడో చెప్పలేనన్నారు. 
 
‘చూస్తుంటే భారత్‌కు అతడు (కోహ్లీ) సుదీర్ఘకాల సారథిగా మనగలుగుతాడో లేదో చెప్పలేను. ఈ ఏడాది ముగిసే వరకు అతడు విదేశాల్లోనే పర్యటించాల్సి ఉంది. తీవ్ర ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. మీడియా నుంచి ఇష్టంలేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సొంత దేశంలో అతడికి మద్దతు దొరకొచ్చేమోగానీ విదేశాల్లో మాత్రం అలా కుదరదు. జట్టు పరంగా విఫలమై ఇబ్బందులు పడుతుంటే ఆ భారం కోహ్లీ మోయగలడో లేదో! ఈ పరిస్థితులను తట్టుకునే మెరుగైన నాయకుడు భారత్‌లో ఉన్నాడా అన్న సంగతి తెలియదు’ అని స్మిత్‌ అన్నారు. 
 
జట్టులో పదేపదే చేస్తున్న మార్పులు కోహ్లీకి ఇబ్బందులు తెస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో మెరుగైన రికార్డున్న రహానెను పక్కన పెట్టి ప్రస్తుత ఫామ్‌ ఆధారంగా రోహిత్‌ను ఎంపిక చేశాడు. తొలి టెస్టులో భువి అద్భుతమైన ఆరంభం ఇచ్చినా రెండో టెస్టుకు దూరం చేశాడు. దీంతో తుదిజట్టు ఎంపిక తీరుపై విరాట్‌పై తీవ్ర విమర్శలు రేగిన సంగతి తెలిసిందే. 
 
అదేవిధంగా మైదానంలో నాయకుడి ప్రవర్తన మిగతా ఆటగాళ్లందరిపై ప్రభావం చూపిస్తుందని స్మిత్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాగా గుర్తెరిగి ముందడుగు వేస్తేనే మంచి నాయకుడు అవుతారన్నారు. కోహ్లీ తన జట్టు సభ్యులతో ఇంకా మమేకంకావాల్సి ఉందన్నారు. నాయకుడి కొన్నిచర్యలు మిగతా వారిపై చెడు ప్రభావం చూపించగలవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు.