1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:31 IST)

శ్రీలంకను ఊడ్చిపారేసిన భారత్... టీ20 కూడా టీమిండియాదే!

శ్రీలంకను భారత్ ఊడ్చిపారేసింది. ఫలితంగా శ్రీలంక పర్యటనను టీమిండియా తిరుగులోని విజయంతో విజయభేరీ మోగించింది. బుధవారం శ్రీలంక‌తో జ‌రిగిన ఏకైక‌ టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.

శ్రీలంకను భారత్ ఊడ్చిపారేసింది. ఫలితంగా శ్రీలంక పర్యటనను టీమిండియా తిరుగులోని విజయంతో విజయభేరీ మోగించింది. బుధవారం శ్రీలంక‌తో జ‌రిగిన ఏకైక‌ టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.
 
7 వికెట్ల తేడాతో భార‌త్ గెలిచింది. మూడు వికెట్లు కోల్పోయిన భార‌త్ 174 ప‌రుగులు చేసి విజ‌యాన్ని చేజిక్కించుంది. భార‌త ఆట‌గాళ్ల‌లో కోహ్లీ 82, పాండే 51 నాటౌట్, రాహుల్ 24 ప‌రుగులు చేసి భార‌త్‌ను విజ‌య ల‌క్ష్యం వైపు తీసుకెళ్లారు. ఇక‌.. టీ20లో మ‌నీశ్ పాండే తొలి అర్థ శ‌త‌కం సాధించాడు. సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లోనూ శ్రీలంక గెల‌వ‌లేదు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన.. ప్రత్యర్థి జట్టు శ్రీలంకను 7 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులకే కట్టడి చేసింది. శ్రీలంక ఆట‌గాళ్ల‌లో మున‌వీర 53, ప్రియంజ‌న్ 40, ఉదాన 19, డిక్వెల్లా 17 ప‌రుగులు చేశారు. ఇక‌.. భార‌త బౌల‌ర్లలో చాహ‌ల్ 3, కుల్దీప్ 2, భువ‌నేశ్వ‌ర్, బుమ్రా చెరో వికెట్ తీశారు.
 
ఆ తర్వాత 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (9) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. లోకేశ్ రాహుల్‌ (24)తో కలిసి రెచ్చిపోయాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. 
 
ఈ క్రమంలో 82 పరుగుల వద్ద అవుటయ్యాడు. మనీష్ పాండే 36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు (నాటౌట్) చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ మరో నాలుగు బంతులు ఉండగానే 174 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌లు రెండూ కెప్టెన్ కోహ్లీని వరించాయి. 
 
ఫలితంగా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను, ఐదు మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు.. ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌ను కూడా భారత్ విజయం సాధించి శ్రీలంక సిరీస్‌ను ఊడ్చిపారేసింది. శ్రీలంక తన చెత్త ప్రదర్శనతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది.