శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (12:30 IST)

కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన... విస్తరణలో వారికే పెద్దపీట

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం రాష్ట్రపతి భవన్‍కు సమాచారం చేరవేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం రాష్ట్రపతి భవన్‍కు సమాచారం చేరవేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రక్షాళన చేపట్టనున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రుల్లో 8 మందికి ఉద్వాసన పలికి.. కొత్తగా 10 మందిని చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణ ఆదివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు. 
 
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా, ఇప్పటికే కొంత మంది మంత్రులు రాజీనామాలు చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కొత్తగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం 8 మంది మంత్రులు ఉద్వాసనకు గురికాబోతున్నారు. అయితే ఈ జాబితాలో తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. దత్తాత్రేయ ఆశించిన విధంగా పని చేయకపోవడం వల్లే మోడీ ఆయనకు ఉద్వాసన చెప్పాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే.. కొత్తగా 10 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే 8 మంది శాఖల్లో మార్పులకు ఛాన్స్ ఉందని సమాచారం. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. ఈ రేసులో ఏపీ బీజేపీ చీఫ్, విశాఖ ఎంపీ హరిబాబు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొత్తగా ఎన్డీయే గూటిలో చేరిన జేడీయూకి కేంద్ర కేబినెట్‌లో రెండు బెర్తులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీకి సన్నిహితమవుతున్న ఎన్సీపీ కూడా కేంద్ర కేబినెట్‌లో చేరొచ్చునని చెబుతున్నారు. తమిళనాడులోని అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేకు కూడా రెండు మంత్రిపదవులను కట్టబెట్టనున్నారు. 
 
ఈ రెండు శాఖలను కూడా పళనిస్వామి, పన్నీర్ వర్గాలకు చెందిన ప్రస్తుత లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురే, ఎంపీ వేణుగోపాల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు.. పలువురు కేంద్ర మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఇందులోభాగంగా, రైల్వేశాఖను నితిన్ గడ్కరీకి కట్టబెట్టనున్నారు. రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్‌కు అప్పగించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే, టీడీపీకి చెందిన సీనియర్ నేత అశోకగజపతి రాజు శాఖలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. మొత్తంమ్మీద ఈ విస్తరణలో ఉత్తరాదివారికి పెద్దపీట వేయనున్నారనే ప్రచారం సాగుతోంది.