శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:25 IST)

రూ.కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోతున్న మాల్యా వారసులు

దేశంలో లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యా వార‌సులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. అదేసమయంలో వారి బండారం బయటపడగానే గుట్టుచప్పుడుకాకుండా విదేశాలకు చెక్కేస్తున్నారు.

దేశంలో లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యా వార‌సులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. అదేసమయంలో వారి బండారం బయటపడగానే గుట్టుచప్పుడుకాకుండా విదేశాలకు చెక్కేస్తున్నారు. తన వ్యాపార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించేందుకు ఈ జ‌ల్సారాయుడు ప‌లు బ్యాంకులు వ‌ద్ద రూ.9 వేల‌కోట్ల రుణాలను పొందాడు. ఆ రుణాల్ని చెల్లించే స‌మ‌యానికి మాల్యా డ‌బ్బుక‌ట్ట‌కుండా మార్చి 2వ తేదీన దేశ విడిచి పారిపోయి, లండన్‌లో తలదాచుకుంటున్నాడు. 
 
తాజాగా మాల్యా వారసులుగా నలుగురు ఉన్నారనీ చెపుతున్నారు. వీరిలో లలిత్ మోడీ, దీప‌క్ త‌ల్వార్, సంజయ్ భండారీ, నిర‌వ్ మోడీలని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో లలిత్ మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేసిన ల‌లిత్ మోడీ ఐపీఎల్‌లో అక్ర‌మాలు, ఫెమా చ‌ట్టం ఉల్లంఘన వంటి కేసుల్లో చిక్కుకుని విదేశాలకు పారిపోయాడు. 
 
ఇకపోతే, కార్పొరేట్ క‌న్స‌ల్టెంట్ అయిన దీప‌క్ త‌ల్వార్ ఎయిర్‌లైన్స్, ఏవియేష‌న్ కంపెనీల‌కు నిబంధ‌న‌లుకు విరుద్ధంగా మేలు చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆదాయ పన్ను శాఖ నుంచి త‌ప్పించేందుకు యూఏఈ పారిపోయాడు. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ. ర‌క్ష‌ణ శాఖ కొనుగోళ్లు, పలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు తేలింది. ఈ ఒప్పందాలను ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. దీంతో నేపాల్ మీదుగా విదేశాలకు చెక్కేశాడు.
 
ఇక చివరగా, నిరవ్ మోడీ. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ వ‌జ్రాల వ్యాపారీ నిర‌వ్ మోడీ కూడా దేశంలో అతిపెద్ద రెండో బ్యాంకింగ్ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,436 కోట్లు కుంభకోణానికి తెర‌దించాడు. ఈ స్కామ్ దేశ బ్యాంకింగ్ రంగాన్ని షేక్ చేస్తోంది. బయ్యర్స్ క్రెడిట్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాల్ని పొందాడు. 
 
అయితే నిర‌వ్ మోడీ బ్యాంకు లావాదేవీల‌పై అనుమానం వ్య‌క్తం చేసిన పీఎన్బీ ఉన్న‌తాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కాం వెలుగులోకి వ‌చ్చింది. కేసు నిమిత్తం అత‌న్ని ప‌ట్టుకునేలోపే మోడీ స్విర్జ‌ర్లాండ్‌కు పారిపోయాడ‌ు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆయన నివాసాల్లో తనిఖీలు నిర్వహించి రూ.5000 కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు ఆభరణాలు, వజ్రాలను సీజ్ చేశారు.