శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (17:59 IST)

ఉత్తర ప్రదేశ్‌కు పెద్దపీట.... బీహార్‌లో బీజేపీ ఎంపీలకే ఛాన్స్

తాజాగా చేపట్టిన కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే పెద్దపీట వేశారు. ఆ తర్వాత బీహార్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ యేడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్న

తాజాగా చేపట్టిన కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే పెద్దపీట వేశారు. ఆ తర్వాత బీహార్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ యేడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ ఆధిక్యం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెల్సిందే. అదేవిధంగా గత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయే మొత్తం 80 స్థానాలకు 73 స్థానాల్లో గెలుపొందింది. దీంతో యూపీకి పెద్దపీట వేశారు. 
 
అలాగే, బీహార్‌లోనూ బీజేపీ భారీ సంఖ్యలో స్థానాలను గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాంటే ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేకదృష్టి అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాజా విస్తరణలో యూపీ, బీహార్‌ల నుంచి తలా ఇద్దరు చొప్పున కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి శివప్రతాప్‌ శుక్లా, సత్యపాల్‌సింగ్‌లకు స్థానం కల్పించారు. అదేవిధంగా బీహార్‌ నుంచి అశ్వని కుమార్‌ చౌబే, రాజ్‌కుమార్‌ సింగ్‌లకు మంత్రిపదవులు కేటాయించారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ప్రమోషన్‌ కల్పించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఉన్న ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి తాజా విస్తరణలో కేబినెట్‌ హోదాతో పదోన్నతి ఇచ్చారు. నఖ్వీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం.
 
అలాగే, కొత్తగా తొమ్మిది మంది మంత్రులతో పాటు ఇప్పటికే సహాయ మంత్రులుగా పనిచేసిన మరో నలుగురికి పదోన్నతి కల్పించారు. దీంతో సహాయ మంత్రులు నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్ర‌దాన్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలకు కేబినెట్‌ హోదా లభించింది. 
 
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాలనాపరంగా పట్టుసాధించేందుకు అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను మోడీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి విసృత్తంగా తీసుకెళ్లే దిశగా ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ కేబినెట్‌ కూర్పులో సామాజిక సమీకరణాలను సైతం ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. 
 
అలాగే ఈ నలుగురు మంత్రుల పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో వారిని ప్రమోట్‌ చేసి కేబినెట్‌ హోదా కల్పించినట్లు ప్రధాని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. పలువురు మంత్రుల పనితీరు బాగా లేకపోవడంతోనే వారితో రాజీనామా చేయించిన విషయం తెల్సిందే.