శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (11:45 IST)

నిర్మలకు ప్రమోషన్... 9 మందికి సహాయ మంత్రులు... ఆ 'నలుగురు' ప్రత్యేకం

ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో నలుగురికి ప్రమోషన్ ఇవ్వగా, 9 కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారోత్

ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఇందులో నలుగురికి ప్రమోషన్ ఇవ్వగా, 9 కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇందులో నలుగురు మంత్రులకు కేబినెట్ హోదా కల్పించారు. వీరిలో ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పియూష్ గోయల్‌లు ఉన్నారు. 
 
అలాగే, స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా శివప్రకాశ్ శుక్లా, అశ్విని కుమార్ చౌదరి, డాక్టర్ బీరేంద్ర కుమార్, అనంత కుమార్ హెగ్డే, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్, డాక్టర్ సత్యపాల్ సింగ్, ఆల్పోన్స్ కన్నన్‌థామన్‌లు ఉన్నారు. 
 
కాగా, కేంద్రమంత్రి వర్గంలో స్థానం కల్పించిన వారిలో నలుగురు మంత్రులు ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఆ నలుగురు కేంద్ర మంత్రులు గతంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసుల్లో విధులు నిర్వర్తించడం విశేషం. దీంతో తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో ఈ నలుగురిపై ప్రత్యేక దృష్టి నిలిచింది. ఈ నేపథ్యంలో వారి వివరాల్లోకి వెళ్తే... 
 
హర్దీప్‌ సింగ్‌ పూరి: ఇండియన్ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి. 1974 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌‌కు చెందిన హర్దీప్‌ సింగ్ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన రీసెర్చ్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్ కంట్రీస్‌ థింక్‌ థాంక్‌‌కు ఛైర్మన్‌ బాధ్యతలతో పాటు న్యూయార్క్‌‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌ ఇండియా సభ్యుడిగా, కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఛైర్మన్‌‌గా విధులు నిర్వర్తించడం విశేషం.
 
సత్యపాల్‌ సింగ్‌: మహారాష్ట్ర కేడర్‌‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తనని తాను పెద్ద గూండాగా అభివర్ణించుకుంటూ, ముంబై మున్సిపల్ కమిషనర్‌ నగరాన్ని గడగడలాడించిన పోలీస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌‌కౌంటర్‌ కేసును ఆయనకు 2011 జూన్‌‌లో ప్రభుత్వం అప్పజెప్పింది. కొంత కాలం విధులు నిర్వర్తించిన ఆయన సహచరులతో విభేదాల మూలంగా ఈ కేసు విచారణ చేయలేనని ముక్కుసూటిగా చెప్పేసి తప్పుకున్నారు. ఏపీ, మధ్యప్రదేశ్‌‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషి చేసినందుకు 1990లో ఆయన ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన ఉత్తర ప్రదేశ్‌‌లోని బాగ్‌‌పత్‌ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అజిత్ సిగ్‌పై విజయం సాధించి, ఎంపీగా ఎన్నికైన ఆయన హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 
 
రాజ్‌కుమార్‌ సింగ్‌ (ఆర్కే సింగ్): 1975 ఐఏస్‌ బీహార్ బ్యాచ్‌‌కు చెందిన రాజ్‌ కుమార్‌ గతంలో హోం సెక్రటరీగా (2011-13) విధులు నిర్వహించారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన, బీహార్‌‌లోని ఆర్రా నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఐఏఎస్ అధికారిగా ఉండగా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు. 1990లో లాలూ ఆదేశాలతో బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీని అరెస్టు చేయించారు. 2015లో క్రిమినల్స్‌కు సీట్లు కేటాయించడంపై పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయతీపరుడైన వ్యక్తిగా పార్టీ దృష్టి నిజాయతీ పరుడైనా వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 
 
అల్ఫోన్స్ కన్నన్ థామన్: 1979 కేరళ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేరళలోని కొట్టాయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన ట్రాక్‌ రికార్డు అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌‌గా విధులు నిర్వహించిన ఆయనకు అక్కడ ‘విధ్వంసకార అధికారి’ గుర్తింపు వచ్చింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. అయితే ఆయన 2006లో సర్వీస్‌‌కు గుడ్‌ బై చెప్పి సీపీఐ(ఎం) మద్ధతుదారుడిగా కంజిరాపల్లి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. కేరళలో ఆరెస్సెస్‌-క్రిస్టియన్‌ గ్రూపుల మధ్య సంధానకర్తగా వ్యవహరించారు.