శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (13:23 IST)

'కుంభకర్ణుడు నిద్ర'కు కారణం ఏంటంటే...

ఎవరైనా గాఢనిద్రలోకి జారుకున్నా.. పొద్దస్తమానం నిద్రపోతున్నా వాడు.. కుంభకర్ణుడిగా నిద్రపోతున్నాడంటూ వ్యాఖ్యానిస్తుంటారు. నిజంగా ఈ కాలంలో కుంభకర్ణుడిగా నిద్రపోయేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే, ఒక వ్యక్తి ఇంతలా నిద్రపోవడానికి గల కారణాలను మాత్రం పరిశోధకులు కనుగొన్నారు.
 
మనిషి శరీరంలో ఆకలిని నియంత్రించే మెదడులోని 'హైపోథాలమస్' గ్రంథికి వాపు రావడమేనని తేల్చారు. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రైనాలజీ, మెటబాలిజం అనే జర్నల్‌లో ఈ గాఢ నిద్రకు కారణమైన హైపోథాలమస్ గురించి ఓ కథనాన్ని ప్రచురించారు. 
 
మెదడులో కణతులు, క్షయ వంటి వ్యాధుల వల్ల లేదంటే తలకు గాయాలవడం మూలంగా దానికి వాపు వస్తుందని, దానిని నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఎండోక్రైనాలజిస్టుగా పని చేసే డాక్టర్‌ ఓం జె. లఖానీ చెప్పారు. 
 
అచ్చం కుంభకర్ణుడి లక్షణాలే కలిగిన ఓ యాభై ఏళ్ల రోగికి చికిత్స చేయడం ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. అతడూ రోజు మొత్తం నిద్ర పోయేవాడని.. లేవగానే తిండి గురించి అరచి.. గీ పెట్టేవాడని చెప్పారు. ఆ లక్షణాలకు కారణం ఆ గ్రంథిలో వాపు అని, ఆ వాపునకు బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణం అని తెలుసుకున్నామని చెప్పారు. కణతిని తొలగించడం ద్వారా గ్రంథిని సాధారణంగా చేయగలిగామని, ఆ తర్వాత అతడు కోలుకున్నాడని లఖానీ చెప్పారు.