శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (10:13 IST)

కాశ్మీర్ అంశాన్ని హఫీజ్ పరిష్కరిస్తాడట.. ఉగ్రవాదులతో ముషారఫ్ పొత్తు పెట్టుకుంటాడట..

జమ్మూ-కాశ్మీర్ సమస్యను ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ పరిష్కరిస్తాడట. హఫీజ్ సయీద్ గృహనిర్భంధం నుంచి విడుదలైన తర్వాత హఫీజ్.. భారత్‌పై వివాదా

జమ్మూ-కాశ్మీర్ సమస్యను ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ పరిష్కరిస్తాడట. హఫీజ్ సయీద్ గృహనిర్భంధం నుంచి విడుదలైన తర్వాత హఫీజ్.. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కాశ్మీర్ పాకిస్థాన్‌కే సొంతం అవుతుందని హఫీజ్ వివాదాస్పద కామెంట్లు చేస్తున్నాడు. ఇందుకు పాకిస్థాన్ మాజీ నియంత, అధ్యక్షుడు ముషారఫ్ కూడా మద్దతు పలికారు. తాజాగా హఫీజ్‌కు మద్దతు పలికేవారిలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా కూడా చేరారు. 
 
సయీద్‌కు కాశ్మీర్ సమస్యను పరిష్కరించే సత్తా ఉందని బజ్వా తెలిపారు. పాకిస్థాన్‌లోని ప్రతీ పౌరుడిలాగే సయీద్‌ను కూడా చూస్తామని బజ్వా అన్నారు. హఫీజ్ కాశ్మీర్ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సెనేట్ కమిటీ సమావేశంలో బజ్వా మాట్లాడుతూ.. హఫీజ్ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో అతడు కీలక పాత్ర పోషించగలడని చెప్పారు. లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), జేయూడీలకు మద్దతు ఇస్తున్నట్టు పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రకటించి రెండు రోజులైనా కాకముందే ఆర్మీ చీఫ్ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలకు పది మిలియన్ డాలర్ల వెల కట్టిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పాక్‌లో గృహ నిర్బంధంలో ఉన్న హఫీజ్ కోర్టు ఆదేశంతో గత నెలలో విడుదలైన సంగతి విదితమే. కాగా భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే తన జీవిత లక్ష్యమని హఫీజ్ స్పష్టం చేశాడు. 
 
మరోవైపు ఉగ్రవాదులతో పొత్తుకు సిద్ధమని పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు ముషారఫ్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన జమాతే ఉద్దవా, లష్కరే తాయిబా ఉగ్రవాదులు దేశభక్తి కలవారని కీర్తించారు. దేశ భద్రత కోసం ఈ సంస్థలతో కలసి పని చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ఈ సంస్థలకు చెందిన వారు కేవలం పాకిస్థాన్ కోసమే జీవిస్తున్నారని, పాకిస్థాన్ కోసమే మరణిస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
ఈ ఉగ్రవాదవాద సంస్థలన్నీ కలిసి రాజకీయ పార్టీని స్థాపిస్తే.. ఇతరులు అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం లేదని ముషారఫ్ తెలిపారు. వారితో పొత్తు పెట్టుకోవడానికి, కలసి పని చేయడానికి తను సిద్ధమని ప్రకటించారు. తనలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యలను తానెప్పుడూ సమర్థిస్తూనే ఉంటానని వెల్లడించారు.