గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (18:14 IST)

సోనియా చేతిలో రూ.60 వేల నగదు... చేబదులుగా రూ.5 లక్షల రుణం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు ముందు ఆమె ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆ తర్వాత తన కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకా గాంధీలతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన ఆస్తిపాస్తులకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను సమర్పించారు.
 
ఈ అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల మేరకు సోనియా వద్ద రూ.60 వేల నగదు చేతిలో ఉంది. మొత్తం రూ.16.59 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. అదేవిధంగా ఆమె మొత్తం రూ.2,44,96,405ని షేర్ల రూపంలో పెట్టుబడులుగా పెట్టారు. వీటిలో రిలయన్స్ హైబ్రిడ్ బాండ్ జి, రూ.28,533 విలువైన ట్యాక్స్-ఫ్రీ బాండ్లు ఉన్నాయి. రూ.72,25,414 విలువైన పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) రూపంలో పెట్టుబడులు ఉన్నట్టు పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, న్యూఢిల్లీలోని డేరామండీ గ్రామంలో రూ.7,29,61,793 విలువైన వ్యవసాయ భూమి తన పేరుతో ఉందని సోనియా తెలిపారు. దీంతో పాటు ఇటలీలో వారసత్వంగా వచ్చే ఆస్తిలో రూ.7,52,81,903 వాటా ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు. ఇకపోతే, తన కుమారుడు రాహుల్ గాంధీ నుంచి చేబదులుగా రూ.5 లక్షల నగదును రుణంగా తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే, 88 కిలోల వెండితో సహా రూ.59,97,211 విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.