మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (15:07 IST)

ప్రియురాలిని చంపి.. బాడీని ముక్కలు ముక్కలు చేసిన జిమ్ యజమాని...

ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రియురాలిని చంపడమే కాదు... మృతదేహాన్ని సైతం ముక్కలు ముక్కలు చేశాడు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన జిమ్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేయసితో పాటు క్యాబ్‌ డ్రైవర్‌ను కూడా హతమార్చిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హేమంత్‌ లంబా అనే వ్యక్తి ఫిట్నెస్ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన జిమ్‌ను నడుపుతున్నాడు. 
 
అతనికి రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి(22)తో పరిచయం ఏర్పడింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తన తండ్రి బంధువుల వద్ద ఉంటున్న ఆమె.. హేమంత్‌తో ప్రేమలో పడింది. ఈ క్రమంలో డిసెంబరు 7వ తేదీన హర్యానాలోని రేవారికి సదరు యువతిని తీసుకువెళ్లిన హేమంత్‌.. ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. తలలో నాలుగు బుల్లెట్లు దింపి పాశవికంగా హత్యచేశాడు.
 
అనంతరం బాధితురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి అక్కడే పడేశాడు. ఆ తర్వాత ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకుని... తనను జైపూర్‌ తీసుకువెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను కోరాడు. అయితే డ్రైవర్‌ ఇందుకు నిరాకరించగా.... అతడిని కూడా తుపాకీతో కాల్చి చంపేశాడు. 
 
అనంతరం అదే కారులో గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతానికి పారిపోయాడు. అక్కడే కారును అమ్మేందుకు ప్రయత్నించగా.. కారు డీలర్‌కు హేమంత్‌ ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతడు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో క్యాబ్‌పై ఉన్న ఓ ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేశాడు. 
 
దీంతో అసలు డ్రైవర్‌ భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది. తన భర్త కనిపించడం లేదని అతడికి చెప్పింది. దీంతో సదరు కారు డీలర్‌ పోలీసులకు సమాచారమివ్వగా.. అసలు విషయం బయటపడింది. 
 
దీంతో హేమంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో విచారణ జరుపగా నేరాన్ని అంగీకరించాడు. రెండు హత్యా నేరాల కింద హేమంత్‌ను అరెస్టు చేశారు. అయితే, ప్రియురాలిని హత్య చేసేందుకు గల కారణాలు తెలియాల్సివుంది.