శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:13 IST)

నా పరిస్థితి అత్యాచారానికి గురైనట్టుగా ఉంది.... అందరూ కలిసి ఇరికించేశారు...

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తీవ్ర నిర్వేదం చెందారు. తన పరిస్థితి అత్యాచారానికి గురైనట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అందరూ కలిసి తనను ఇరికించారని వాపోయారు. పైగా, అత్యాచార బాధితురాలిని పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారించినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా ఆపరేషన్ కమలకు ఆయన తెరలేపారు. పలువురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఇవి కర్ణాటక అసెంబ్లీని కుదిపేశాయి. పనిలోపనిగా స్పీకర్ రమేష్ కుమార్‌పై కూడా ఆరోపణలు చేశారు. 
 
దీనిపై స్పీకర్ రమేష్ కుమార్ స్పందిస్తూ, "ఈ ఆపరేషన్ ఆడియోలో స్పీకర్ రమేష్ కుమార్‌ను రూ.50 కోట్లకు సరిచేసుకున్నామనే వ్యాఖ్య ఒక్కసారే ఉంది. కానీ, రెండు రోజులుగా ఇటు అధికార, అటు ప్రతిపక్ష సభ్యులు వందలసార్లు రూ.50 కోట్లు అంటూ... ప్రస్తావించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి అత్యాచారానికి గురైనవారిని పోలీస్‌ స్టేషన్‌లో, కోర్టులో విచారణ జరిపినట్టే ఉందంటూ నిర్వేదం చెందారు. ఆ తర్వాత జరిగే న్యాయం ఎలా ఉన్నా తనను మాత్రం అందరూ ఇరికించేశారని విచారం వ్యక్తం చేశారు.