శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (11:30 IST)

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. బోరున విలపించిన సిద్ధరామయ్య

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విర

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ లేనప్పటికీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని... ఇదే అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామన్నారు. బీజేపీ చేస్తున్న దారుణ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. యడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించుకోవాలనుకుంటే... ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలంటూ సిద్ధరామయ్య బహిరంగ సవాల్ విసిరారు. 
 
ఇకపోతే, బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధరామయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ చేసిన కృషిని ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
సంక్షేమ పథకాలను విస్మరించి కేవలం కులాలు, జాతుల అంశాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజలు తమను ఓడించారని పేర్కొన్నారు. తమ ప్రణాళికలను ప్రజలే మార్చేశారని అన్నారు. విజయంపై ఎంతో ధీమాగా ఉన్నప్పటికీ జనం తమను ఓడించారని ఆవేదన వ్యక్తంచేశారు.