1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (11:27 IST)

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు : త్రిపురలో సీపీఎం కంచుకోట బద్ధలు

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్, నాగాలాండ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. త్రిపురలో సీపీఎం పాలనకు తెరపడింది.

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్, నాగాలాండ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. త్రిపురలో సీపీఎం పాలనకు తెరపడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోనుంది. సీపీఎం 21, బీజేపీ 38 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 
మేఘాలయంలో కాంగ్రెస్ 23 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తుండగా, ఎన్‌పీపీ 15 స్థానాలతో రెండో స్థానంలోనూ, బీజేపీ 5 స్థానాలతో మూడో స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
నాగాలాండ్‌లో బీజేపీ 29 స్థానాల్లోనూ, ఎన్‌పీఎఫ్ 26 స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. స్వతంత్రులు నలుగురు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఇక్కడ అధికారానికి ఇండిపెండెట్ల మద్దతే కీలకం కానుంది.
 
కాగా, త్రిపురలో గతనెల 18న ఎన్నికలు జరగ్గా, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ హాల్స్ వద్ద కేంద్ర బలగాలను మోహరించినట్టు త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) శ్రీరామ్ తరణికాంత తెలిపారు. మూడు రాష్ట్రాల్లో గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగా ఉన్నాయి.