శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (10:14 IST)

మద్రాస్ ఐఐటీలో అంటరానితనం...

దేశంలో ఉన్న ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మద్రాస్ ఐఐటీల అంటరానితనం బుసలుకొడుతోంది. ఈ విద్యా ప్రాంగణంలో ఉంటూ మాంసాహారం తినే విద్యార్థులను అంటరానివాళ్ళుగా చూస్తున్నారు. ముఖ్యంగా, ఐఐటీ ప్రాంగణంలోని హిమాలయన్ మెస్ కాంప్లెక్స్‌లో ఈ పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని అంబేద్కర్, పెరియార్ స్టడీ సర్కిల్‌కు చెందిన విద్యార్థులు బహిర్గతం చేశారు. దీంతో ఇది పెను వివాదంగా మారింది. అయితే, ఇలాంటి వివాదమేదీ లేదని మద్రాస్ ఐఐటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హిమాలయన్ మెస్ కాంప్లెక్స్‌ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న ఉత్తర భారతీయుల మెస్‌లో శాఖాహారులు, మాంసాహారులకు వేర్వేరు క్యాంటిన్‌లు ఏర్పాటు చేశారు. వేర్వేరు ఎంట్రెన్స్, ఎగ్జిట్ ద్వారాల్లో వెళ్లాలంటూ పోస్టర్లు కూడా అంటించారు. అంతేకాదు వాష్ బేసిన్స్‌, ప్లేట్స్, స్పూన్స్ సైతం వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
 
దీంతో ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో మాంసాహారులపై వివక్ష చూపుతున్నారంటూ కొందరు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ అనే దళిత విద్యార్థుల సంఘం నేతలు మెస్ ప్రాంగణంలోని పోస్టర్లను ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. గత ఏడాది శాఖాహారుల కోసం ప్రత్యేక మెస్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెచ్చారని.. ఇప్పుడేమో మాంసాహారులను అంటరానివారిగా చూస్తున్నారని వాపోతున్నారు.
 
కాగా, గత యేడాది క్యాంపస్‌లో బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్ధులు రెండు వర్గాలుగా చీలిపోయారు. బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఓ విద్యార్థిపై ఏబీవీపీ విద్యార్థులు దాడులు చేయగా, ఈ రచ్చ మరింత ముదిరింది. తాజాగా శాఖాహార విద్యార్థుల కోసం ప్రత్యేక మెస్ ఏర్పాటు చేసి.. తమను అంటరాని వారిగా పక్కనబెట్టారని ఓ వర్గం విద్యార్థులు మండిపడుతున్నారు.