శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (15:52 IST)

జగన్‌కు షాకిచ్చిన ''ప్యారడైజ్ పేపర్స్'': పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజే.. #BlackMoney లిస్టులో..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని 2019 ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో జగన్ బరిలో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని 2019 ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో జగన్ బరిలోకి దిగారు. అయితే నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించిన రోజునే జగన్‌కు గట్టి షాక్ తగిలింది. విదేశాలకు నల్లధనాన్ని తరలించిన జాబితాలో జగన్మోహన్ రెడ్డి పేరు వుందని తేలింది. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్న జగన్‌కు ప్యారడైజ్ పేపర్స్ ద్వారా మరో షాక్ తగిలింది. 
 
దేశంలోని పలువురు పెద్దల పేర్లను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) తన 'ప్యారడైజ్ పేపర్స్' ద్వారా బయటపెట్టిన సంగతి తెలిసిందే. 'యాంటీ బ్లాక్ మనీ డే'ను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో, ఈ బిగ్ డేటా విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. ప్యారడైజ్ పేపర్లపై ఇన్వెస్టిగేషన్ జరిపిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ వీటిపై వరుస కథనాలను ప్రచురించనున్నట్టు ప్రకటించింది. ఈ బిగ్ డేటా ప్రస్తుతం భారత రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
 
ఈ పేపర్లలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వున్నాయి. ఇందులో  జగన్ పేరు వుండటం వైకాపా శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఇక కాచుకుకూర్చున్న టీడీపీ నేతలకు మంచి మేత దొరికిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్యారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరుండటాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ప్యారడైజ్ పేపర్లలో తన పేరుండటాన్ని ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాలి.