శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (15:51 IST)

దటీజ్ మోడీ... కరుణతో భేటీ... తమిళనాట రాజుకున్న రాజకీయ సెగ(Video)

"రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు... శాశ్వత మిత్రులు లేరు" అన్నది నానుడి. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు రుజువు చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం చెన్నైకు వచ్చిన ప్రధాని మోడీ... డీఎంక

"రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు... శాశ్వత మిత్రులు లేరు" అన్నది నానుడి. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు రుజువు చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం చెన్నైకు వచ్చిన ప్రధాని మోడీ... డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలుసుకున్నారు.
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై గోపాలపురంలోని తన నివాసానికే పరిమితమైన ఈ తమిళ రాజకీయ కురువృద్ధుడిని ఆయన కలుసుకుని పరామర్శించి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
కరుణానిధి నివాసానికి వచ్చిన మోడీకి డీఎంకే కార్యచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి, రాజ్యసభ సభ్యురాలు కనిమొళిలు స్వయంగా ఆహ్వానించారు. ఆ తర్వాత కరుణానిధి ఉండే గదికి వెళ్లిన మోడీ కొద్దిసేపు అక్కడే గడిపారు. 
 
ఈభేటీతో తమిళనాట రాజకీయ సెగ మొదలైంది. ఓ వైపు అధికార అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం పన్నీర్-పళని, దినకరన్ వర్గాల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 10 నిమిషాల పాటు మోడీ, కరుణానిధి మధ్య జరిగిన భేటీపై రాజకీయ వేడి మొదలైంది. 
 
ఈ యేడాది మొదట్లో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలను ఏకం చేసేందుకు బీజేపీ మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు వర్గాలూ చేతులు కలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్తంభింపచేసిన పార్టీ గుర్తు ‘రెండు ఆకులు’ మాత్రం ఇంకా దక్కలేదు. ఈనేపథ్యంలో డీఎంకే అధినేత మోడీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
నిజానికి వచ్చే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయినప్పటికీ.. బీజేపీకి ఖాతా తెరిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. దీంతో డీఎంకేతో జట్టు కట్టేందుకే మోడీ ఇప్పటినుంచే కార్యాచరణ మొదలుపెట్టారనీ, ఇందులోభాగంగానే కరుణానిధిని కలిశారన్న వాదన లేకపోలేదు. మొత్తంమీద మోడీ ఒకరోజు చెన్నై పర్యటన తమిళనాట రాజకీయ చర్చకు దారితీసింది.