శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (14:03 IST)

#ChennaiRains : మరో 24 గంటలు వర్షాలే... భయం గుప్పిట్లో చెన్నైవాసులు

గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది.

గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగామారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలకు ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది చనిపోయారు. 
 
వర్షంతో చెన్నైలోని ప్రధాన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గురువారం రాత్రి మెరీనా బీచ్‌లో 30 సెంటీమీటర్ల వర్షం కురవటంతో బీచ్‌ సర్వీస్‌ రోడ్లన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. చాలాచోట్ల భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మరోవైపు, చెన్నై పరిసరప్రాంతాల్లోని రిజర్వాయర్లు నిండిపోయాయని వాటి కట్టలు తెగిపోయే ప్రమాదముందనే సమాచారంతో చెన్నై శివార్లతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవన్నీ వదంతులేనని.. రిజర్వాయర్లు భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ఈ వర్షం దెబ్బకు మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, పన్నీర్ సెల్వం నివాసాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. స్థానిక గోపాలపురంలోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆళ్వార్‌పేటలోని డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంసహా పలువురు మంత్రుల నివాసాల్లోకి వరదనీరు వచ్చింది. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అయితే, ఐదు రోజులుగా చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం, తిరువారూరు, కడలూరు సముద్రతీర జిల్లాల్లో వర్ష బీభత్సంతో ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. మరో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాలేజీలు, స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. .
 
కాగా, భారీ వర్షాలకు నాగపట్టణం చిగురుటాకులా వణికిపోతోంది. ఒకవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండగా మరోవైపు కుండపోత కారణంగా జిల్లాలో పలుప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలో వేల ఇళ్లు, లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగాయి. దాదాపు 10వేల మంది మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షంతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరించింది.