శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (10:43 IST)

మూత్రవిసర్జన చేశాడనీ.. ఎమర్జెన్సీ రోగిని వేలాడదీశాడు.. ఎక్కడ?

అంబులెన్స్‌లు ఆపదలో ఉన్న వారిని రక్షించి ప్రాణదానం చేస్తుంటాయి. అంబులెన్స్ డ్రైవర్లు కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎమర్జెన్సీ రోగులను ఆస్పత్రులకు చేర్చుతుంటారు.

అంబులెన్స్‌లు ఆపదలో ఉన్న వారిని రక్షించి ప్రాణదానం చేస్తుంటాయి. అంబులెన్స్ డ్రైవర్లు కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎమర్జెన్సీ రోగులను ఆస్పత్రులకు చేర్చుతుంటారు. కానీ, ఈ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఎమర్జెన్సీ రోగి పట్ల యమకింకరుడిగా మారాడు. తన అంబులెన్స్‌లో మలమూత్ర విసర్జన చేశాడన్న కారణంతో.. రోగి పడుకొన్న స్ట్రెచర్‌ను తలకిందులుగా వేలాడదీశాడు. ఆ తర్వాత 24 గంటల్లోనే ఆస్పత్రిలో ఆ రోగి మరణించాడు. కొందరు కర్కశ డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణికి ఈ ఘటన పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఈ కేరళలోని త్రిసూర్‌లో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ పాదచారిని అటుగా వచ్చిన వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన అతడిని దారిని పోతున్న ఓ వ్యక్తి గుర్తించి, దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సలహా మేరకు పాలక్కడ్‌ జిల్లా ఆస్పత్రికి అతడిని తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 70 కిలోమీటర్ల దూరంలోని త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించారు. 
 
త్రిసూర్‌ ఆస్పత్రి వద్ద తన అంబులెన్స్‌ను డ్రైవర్‌ ఆపాడు. వాహనం వెనుక తలుపు తెరిచి చూడగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆ రోగి విసర్జించిన మలమూత్రాలు, వాంతితో స్ట్రెచర్‌, కార్పెట్‌ తడిచిపోయాయి. అదంతా చూసిన డ్రైవర్‌ ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆ స్ట్రెచర్‌ను ఒకవైపు పట్టుకొని రోడ్డుకు ఆనేలా బయటకు కొంతభాగం లాగాడు. చాలా సేపటి తర్వాత మెడికల్‌ కాలేజీ సిబ్బంది అక్కడకు చేరుకొని.. స్ట్రెచర్‌పై ఉన్న ఆ వృద్ధుడిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఆ ఆస్పత్రిలో అతడు మరణించాడు. అంబులెన్స్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేశారు.