శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (05:59 IST)

బీజేపీకి షాకిచ్చిన పంజాబ్ ఓటర్లు... బైపోల్‌లో కాంగ్రెస్‌ గ్రాండ్ విక్టరీ

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి పంజాబ్, కేరళ బై పోల్స్ జోష్ నింపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. కేరళలో యూడీఎఫ్ అభ్యర్థి విజయభేరీ మోగించారు. ఈ రెండు ఉప

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి పంజాబ్, కేరళ బై పోల్స్ జోష్ నింపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. కేరళలో యూడీఎఫ్ అభ్యర్థి విజయభేరీ మోగించారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. 
 
ముఖ్యంగా, పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 
 
బీజేపీ సిట్టింగ్ స్థానమైన గురుదాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జఖర్ గ్రాండ్ విక్టరీ సాధించారు. సునీల్ జఖర్‌కు 4,99,752 ఓట్లు వచ్చాయి. బీజేపీకి అభ్యర్థి స్వరణ్ సలారియాకు 3,06,553, ఆప్ అభ్యర్థి సురేష్ ఖజురియాకు 23,579 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ సిట్టింగ్ స్థానంలో గెలుపుతో కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారు. 
 
నిజానికి ఆర్నెల్ల క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ సర్కారు గద్దెనెక్కింది. ఈ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉంటుందని ఆశించిన బీజేపీ నేతలకు భంగపాటు కలిగిస్తూ, ప్రజలు తాము కాంగ్రెస్ వెంటే ఉన్నామని తేల్చి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే.. కేరళ ప్రజలు కూడా కాంగ్రెస్‌కు మంచి శుభవార్త తెలిపారు. వెంగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి ఖాదర్ గెలిచారు. ఎల్డీఎఫ్ అభ్యర్థిపై 23,312 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లో కాంగ్రెస్ తర్వాత… ముస్లిం లీగ్ రెండో పెద్ద పార్టీగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో కాంగ్రెస్ ఫుల్ ఖుషీగా ఉంది.