1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (08:32 IST)

శతాధిక వృద్ధురాలిని బ్యాంకుకు రప్పించిన మేనేజరుపై వేటు!!

నెలవారి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేందుకు శతాధిక వృద్ధురాలిని బ్యాంకుకు రమ్మన్నందుకు బ్యాంకు మేనేజరుపై ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. వృద్ధాప్య పెన్షన్ రూ.1500 కావాలంటే ఆ వృద్ధురాలిని బ్యాంకు తీసుకుని రావాల్సిందేనంటూ బ్యాంకు మేనేజరు పట్టుబట్టాడు. దీంతో 60 యేళ్ల కుమార్తె... 120 యేళ్ళ తన తల్లిని మంచంపై పడుకోబెట్టి.. మంచాన్ని బ్యాంకు వరకు ఈడ్చుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు కుప్పించారు. చివరకు ఈ వ్యవహారం బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బ్యాంకు మేనేజరుపై వేటు వేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని నౌపారా జిల్లా ఖరియర్ బ్లాకులోని బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో మంచం పట్టింది. ఈమెకు నెలనెలా రూ.1500 వృద్ధాప్య వెన్షన్ వస్తూ వుంది. ఈ డబ్బుల తీసుకురావాల్సిందిగా 60 ఏళ్ల కుమార్తె గుంజాదేవిని బ్యాంకు పంపింది. 
 
అయితే, అలా ఎవరికి పడితే వారికి పెన్షన్ డబ్బులు ఇవ్వబోమని, ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఆమె బ్యాంకుకు రావాల్సిందేనని మేనేజర్ తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని గుంజాదేవి ఇంటికెళ్లి తన తల్లి పడుకున్న మంచాన్ని బ్యాంకు వరకు ఈడ్చుకొచ్చింది. లాభీ భాగేల్‌ను చూసిన తర్వాత కానీ అధికారులు పింఛన్ డబ్బులు విడుదల చేయలేదు.
 
వృద్ధురాలిని మంచానికి కట్టి బ్యాంకు ఈడ్చుకొస్తున్న వీడియో వైరల్ కావడంతో బ్యాంకు అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం రూ.1500 పెన్షన్ కోసం ఇద్దరు వృద్ధ మహిళలతో బ్యాంకు అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. 
 
దీంతో స్పందించిన ఉన్నతాధికారులు వృద్ధురాలిని బ్యాంకుకు తీసుకురమ్మన్న ఉత్కల్ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. కాగా, ఈ గ్రామీణ బ్యాంకులో అత్యధిక వాటాను ఎస్.బి.ఐ కలిగివుంది. దీంతో బ్యాంకు మేనేజరును ఎస్.బి.ఐ. ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.