శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (08:45 IST)

ఆ స్కూల్‌లో తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300 ఫైన్.. ఎక్కడ?

దేశంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల తీరు తమ ఇష్టారాజ్యంగా ఉంది. తాము చెప్పిందే చట్టం. ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300, టీసీ కావాలంట

దేశంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల తీరు తమ ఇష్టారాజ్యంగా ఉంది. తాము చెప్పిందే చట్టం. ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300, టీసీ కావాలంటే రూ.15 వేల అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీవ్రమైన శిక్షలు విధిస్తున్న పాఠశాల తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా శెట్టిపాళెయంలో ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శెట్టిపాళెయంలోని ప్రైవేట్ పాఠశాలలో ఎదురవుతున్న వేధింపులపై విద్యార్థిని లక్ష్మి తన తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది. తమ స్కూల్ పీటీ మాస్టర్ చిన్నచిన్న సమస్యలకు పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారని ఫిర్యాదులో బాలిక పేర్కొంది. స్కూల్‌లో తుమ్మితే 200 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువసార్లు తుమ్మితే స్కూల్ మైదానం చుట్టూ రౌండ్లు వేయాల్సిందేనని తెలిపింది.
 
ముఖ్యంగా, మాతృభాష తమిళంలో మాట్లాడితే 300 రూపాయలు చెల్లించాల్సిందేనని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు మాట్లాడితే వారితో మరుగుదొడ్లు కడిగిస్తున్నారని వాపోయింది. జరిమానా కట్టకపోయినా స్కూలు మొత్తం పరుగులు తీయాల్సిందేనని, అనారోగ్యంతో బాధపడినా చేయాల్సిందేనని కన్నీటిపర్యంతమైంది. 
 
ఇంటి నుంచి తీసుకొచ్చిన మంచి నీరు తాగొద్దని, స్కూల్ ట్యాంకులోని మురికినీరే తాగాలని టీచర్లు వేధిస్తున్నారంటూ విలపిస్తూ చెప్పింది. ఈ చర్యలతో విసిగిపోయి మరో స్కూల్‌లో జాయిన్ అవ్వాలని టీసీ అడిగితే 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.