శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (14:29 IST)

ఆ పిల్లను చేసుకుంటే మా అమ్మో.. మా నాన్నో చనిపోతాడు...

ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను ఆ యువకుడు గుడ్డిగా నమ్మేశాడు. ఆ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మో.. మా నాన్నో చనిపోతాడంటూ ఆరోపిస్తూ ఓ యువతితో కుదిరిన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.

ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను ఆ యువకుడు గుడ్డిగా నమ్మేశాడు. ఆ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మో.. మా నాన్నో చనిపోతాడంటూ ఆరోపిస్తూ ఓ యువతితో కుదిరిన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. చివరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ కాలనీకి చెందిన పొన్నమల్లు లక్ష్మి, వెంకటయ్య కుమారుడు అనిల్‌కు, సిద్దిపేట మండలం పొన్నాల మధిర గ్రామమైన బట్రాంపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ, నర్సింలు కుమార్తె స్వప్నతో రెండుమూడు నెల్ల క్రితమే వివాహం నిశ్ఛయమైంది. గత రెండుమూడు నెలలుగా శుభముహుర్తాలు లేక పోవడంతో ఫిబ్రవరి 22వ తేదీ నిశ్చితార్థం, మార్చి 8వ తేదీన పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్నారు. ఈ మేరకు పెళ్లికుమార్తె తరపు వారు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకున్నారు. 
 
ఇంతలో పెళ్లికుమారుడు అనిల్ సిద్ధిపేటలోని రాజుపంతులు అనే జ్యోతిషుడికి అమ్మాయి పుట్టిన తేదీ ప్రకారం జాతకం చూపించాడు. పెళ్లి కుమార్తె జాతకం ప్రకారం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తకు లేదా మామకు ప్రాణహాని తప్పదని చెప్పడంతో ఈ పెళ్లికి వరుడు అనిల్ నిరాకరించాడు. దీంతో ఆందోళనకు గురైన పెళ్లి కూతురి తరుపు బందువులు జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. 
 
ఈ విషయమై జ్యోతిష్యుడిని నిలదీయడంతో పెళ్లికుమారుడు చూపిన జాతకం ప్రకారం అమ్మాయి పేరు మీద బలం లేదని, పెరు మార్చుకోవాలని మాత్రమే సూచించాని చెప్పాడు. అయితే, వరుడు మాత్రం జ్యోతిష్యుడు మరోలా చెప్పాడనీ, అందువల్ల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబనని తెగేసి చెప్పాడు. దీనిపై బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో సిద్దిపేట ఒకటో పట్టణ పోలీసులు పెళ్లి కొడుకు అనిల్, జ్యోతిష్కుడు రాజు పంతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.