ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (14:25 IST)

జగడాల సుడిగుండంలో 'పద్మావతి'.. ఇదీ అసలు కథ...

దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రాల్లో "పద్మావతి" ఒకటి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం నుంచి వివాదాలు అలుము

దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రాల్లో "పద్మావతి" ఒకటి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం నుంచి వివాదాలు అలుముకున్నాయి. ఈ చిత్రంలో పద్మావతి పాత్రను వక్రీకరిస్తున్నారని రాజ్‌పుత్‌ వర్గీయుల్లోని కర్ణిసేన అనే వర్గం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. దీనికితోడు ఈ వివాదానికి రాజకీయరంగు పులుముకుంది. ఫలితంగా ఈ చిత్రానికి సెంట్రల్ సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్రం కథ ఎలా ఉన్నప్పటికీ.. చరిత్రలో అసలు పద్మావతి అనే రాణి ఉందా? లేదా? అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ పద్మావతి జీవితంపై ఒక్కో కవి ఒక్కోవిధంగా రాశాడు. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మాలిక్ మహ్మద్ జయాసీ అనే సూఫీ రచయత 1540లో రాసిన పద్మావతి అనే రచన ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించారు.
 
ఈ రచన ప్రకారం శ్రీలంక(సింహాల)రాజు గంధర్వ్ సేన్. ఈయనకు అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరే పద్మావతి. ఆమె చెంత ఎల్లవేళలా మాట్లాడే చిలుక ఒకటి ఉండేది. చిలుక అంటే పద్మావతికి అమితమైన ప్రాణం. పైగా, పద్మావతి ఎప్పుడూ ఈ చిలుకతోనే ఉండేది. దీంతో ఆమె తండ్రి గంధర్వ్ సేన్‌కు ఓ రోజున కోపం వచ్చి చిలుకను చంపాలని చూస్తాడు. కానీ ఆ చిలుక తప్పించుకొని ఓ వేటగాడి చేతికి చిక్కుతుంది. అలా చిలుక చివరికి చిత్తోర్‌గఢ్ రాజు రావల్ రతన్ సింగ్ దగ్గరకు చేరుకుంటుంది. అది మాట్లాడే చిలుకు కాబట్టి రాజు పద్మావతి అందం, గుణాలకు గురించి చిలుక రాజుకు చెబుతుంది. దీంతో రాజుకు పద్మావతిపై మోజుపడుతుంది. 
 
ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని మనసులోనే ఓ నిర్ణయానికి వస్తాడు. అయితే రతన్ సింగ్ అప్పటికే వివాహమై నాగ్‌మతి అనే భార్య ఉంటుంది. కానీ పద్మావతి దక్కించుకోవాలని కోరికతో రతన్ సింగ్ వెంటనే సింహాల రాజ్యంపై దండెత్తి గంధర్వ్ సేన్ రాజును ఓడిస్తాడు. దీంతో తన కూతురు పద్మావతిని రతన్ సింగ్‌కు ఇచ్చి వివాహాం జరిపిస్తాడు. రతన్ సింగ్, అతని మొదటి భార్య నాగ్‌మతిల మధ్య చిచ్చుపెట్టేందుకు రాఘవ్ చేతన్ ప్రయత్నిస్తాడు. విషయం తెలుసుకున్న రాజు అతన్ని రాజ్యం నుంచి వెలివేస్తాడు. 
 
రాజ్యం నుంచి వెళ్లిపోయిన రాఘవ్.. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఆశ్రయం పొందుతాడు. సుల్తాన్‌కు రాఘవ్ పద్మావతి గురించి, ఆమె అందాల గురించి వివరిస్తాడు. దీంతో ఖిల్జీ కూడా పద్మాతిపై మనసు పారేసుకుని చిత్తోర్‌గఢ్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ తర్వాత రతన్ సింగ్‌ను ఖిల్జీ బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకుని పద్మావతి రతన్ సన్నిహితులైన గోరా, బాదల్ సహాయంతో ఢిల్లీ వెళ్లి ఖిల్జీ‌పై యుద్ధం చేసి తన భర్తను కాపాడుకుంటుంది. ఇలా పద్మావతి చరిత్రను మాలిక్ మహ్మద్ జయాసీ రచించాడు. అలాగే, హేమ్‌రతన్‌ అనే కవి తన రచనలో మరోలా పేర్కొంటాడు. 
 
అయితే, ఈ చిత్రంలో పద్మావతి - ఖిల్జీకి మధ్య శృంగారంతో పాటు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్నది కర్ణిసేన ప్రధాన ఆరోపణగా ఉంది. వాస్తవను కథను వక్రీకరించి, కలెక్షన్ల కోసం ఖిల్జీ, పద్మావతి మధ్య ఈ తరహా సన్నివేశాలు సృష్టించారని వీరి ప్రధాన ఆరోపణ. అందుకే ఈ చిత్రం జగడాల సుడిగుండంలో చిక్కుకుంది.