శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (14:27 IST)

కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి పవర్ చూపిద్ధాం.. బీజేపీకి ముచ్చెమటలు... ఎందుకని?

తెలుగోడి సత్తా ఏంటో కర్ణాటక రాష్ట్ర శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో చూపిద్ధామంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంతో భారతీయ జనతా పార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

తెలుగోడి సత్తా ఏంటో కర్ణాటక రాష్ట్ర శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో చూపిద్ధామంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంతో భారతీయ జనతా పార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. కర్ణాటక ఎన్నికలకు, తెలుగోడి సత్తాకు, బీజేపీ నేతలకు ముచ్చెమటలకు సంబంధం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
కర్ణాటక రాష్ట్ర శాసనసభకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో తెలుగు ప్రజలను మభ్యపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో పాటు.. తడి గుడ్డతో తెలుగు ప్రజల గొందుకోసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రతి తెలుగు పౌరుడు కసితో రగిలిపోతున్నాడు. ఇందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలనే ఆయుధంగా ఎంచుకున్నారు.  
 
ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఓటర్లు పలు నియోజకవర్గాల్లో ఉన్నారు. వీరికి అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేయగల శక్తి ఉంది. అలా దాదాపు 40 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు అత్యంత కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా, బళ్లారి, రాయచూరు, కొప్పళ, బెంగళూరు నగరం, బెంగళూరు గ్రామీణ, తుమకూరుతో పాటు.. 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు ఓటర్లు ఎటువైపు మొగ్గితో వారిదే విజయం. 
 
మరీ ముఖ్యంగా బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో స్థిరపడిన తెలుగు వారికి నవ్యాంధ్రతో సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇపుడు ఏపీ ప్రజలను బీజేపీ తడి గుడ్డతో గొంతుకోసిన నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదనీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే తగిన గుణపాఠం నేర్పుదామంటూ తెలుగు నెటిజన్లు పిలుపునిచ్చారు.