శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 16 జులై 2018 (09:43 IST)

కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీ : ప్రధాని నరేంద్ర మోడీ

కాంగ్రెస్ ముస్లిం పురుషులకు సంబంధించిన పార్టీ అని, అది వారి కోసం మాత్రమే ఆలోచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఆజంగఢ్‌లో లక్నో-ఘాజీపూర్ మధ్య రూ.23 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న పూర్వ

కాంగ్రెస్ ముస్లిం పురుషులకు సంబంధించిన పార్టీ అని, అది వారి కోసం మాత్రమే ఆలోచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఆజంగఢ్‌లో లక్నో-ఘాజీపూర్ మధ్య రూ.23 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ముస్లిం పురుషుల గురించి మాత్రమే ఆలోచిస్తుందని.. ట్రిపుల్ తలాక్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పార్టీల నైజం బయటపడుతుందన్నారు.
 
మైనార్టీల గురించి, ప్రత్యేకించి ప్రమాదంలో ఉన్న ముస్లిం మహిళల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. ఇస్లామిక్ దేశాల్లో నిషేధించినట్లుగానే మనదేశంలోనూ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని కోట్లాది మంది ముస్లిం మహిళలు డిమాండ్ చేస్తున్నారని, అందుకే ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు. 
 
తమది ముస్లింల పార్టీ అని కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పినట్లుగా ఇటీవల పత్రికల్లో చదివానని.. ట్రిపుల్ తలాక్‌పై కాంగ్రెస్ వైఖరి చూస్తే అది ముస్లిం పురుషుల పార్టీ మాత్రమేనని తేటతెల్లమవుతున్నదన్నారు. ముస్లిం మహిళల గౌరవం గురించి కానీ, వారి హక్కుల గురించికానీ ఆ పార్టీకి ఏమీ పట్టదా? అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌ను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. 
 
ముస్లిం మహిళలు ఇంకా చీకటిలోనే మగ్గిపోవాలన్నదే కాంగ్రెస్ పార్టీ అభిమతమన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదని.. ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా బాధితులను కలిసి.. వారి బాధల్ని తెలుసుకోవాలన్నారు. ఉడాన్ పథకం కింద యూపీలో 12 విమానాశ్రయాలను అభివృద్ధి పరుస్తున్నట్లు వెల్లడించారు. సొంత నియోజకవర్గం వారణాసికి వెళ్లిన మోడీ.. గవర్నర్ రామ్‌నాయక్, సీఎం ఆదిత్యనాథ్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.