మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (15:45 IST)

బీజేపీకి షాకిచ్చిన స్వతంత్ర ఎమ్మెల్యే.. నిన్న మద్దతు.. నేడు వెనక్కి

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ధోరణితో కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వారు కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకు మద్దతు ఇస్తూ వచ్చిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు గాలం వేసి తమవైపునకు తిప్పుకున్నారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్ల మేరకు ఆఫర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఇదిలావుంటే ముఖ్యమంత్రి కుమార్ స్వామి సర్కారుకు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్ సంక్రాంతి పండుగ రోజైన మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్‌కు లేఖ కూడా రాశారు. ఈ లేఖ రాసి 24 గంటలు కూడా గడవకముందే ఆయన పునరాలోచనలో పడ్డారు. బీజేపీకి షాకిచ్చి... మళ్లీ కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకే మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్. నగేష్ సంగతి మాత్రం ఇంకా తెలియరాలేదు. 
 
కాగా, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్‌కు మాత్రం బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప మాత్రం భారీగానే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. మంత్రి పదవి ఇస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. అక్కడకు వెళ్లాక వాస్తవ పరిస్థితులను గ్రహించి తిరిగి స్వామి సర్కారుకే జైకొట్టడం ఇపుడు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది.