శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (17:50 IST)

కర్ణాటకలో హైడ్రామా : జేడీఎస్ సర్కారుకు ఇద్దరు ఎమ్మెల్యేల ఝలక్

కర్ణాటక రాజకీయాలు అమిత ఆసక్తిని రేపుతున్నాయి. గంటకో విధంగా రక్తికడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలుకు ముమ్మరంగా బేరసారాలు జరుగుతున్నాయంటూ ప్రభుత్వంతో విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు జేడీఎస్ సర్కారుకు ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌కు వారు స్వయంగా లేఖ రాశారు. 
 
రాష్ట్రంలోని రణెబెన్నర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.శంకర్, మాళబగిళు నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ గవర్నర్‌కు లేఖలు పంపారు. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నామని, దీనికనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖల్లో వారు కోరారు. అయితే మద్దతు ఉపసంహరణకు గల కారణాలను మాత్రం వారు వివరించలేదు. 
 
తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి మంచి పాలన అందించాలని జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి తాను మద్దతిచ్చానని, కానీ వారు అందులో పూర్తిగా విఫలమయ్యాయరని ఎమ్మెల్యే నగేశ్ చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేదని, అందుకే బీజేపీకి మద్దతు ఇస్తే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. 
 
మరో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నానని, అందుకే మద్దతు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సోమవారం కామెంట్స్ చేశారు. అదేసమయంలో లోక్‌సభ ఎన్నికల నాటికి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు.