ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (15:54 IST)

బాబ్బాబు... ఒక్కసారి వచ్చి మా బాబు చంద్రబాబును కలవండి.. విజయసాయి సెటైర్లు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు మాటలదాడి చేశారు. ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు బీజేపీకి చెంద

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు మాటలదాడి చేశారు. ప్రత్యేక హోదా కోసం విపక్ష పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు బీజేపీకి చెందిన ఎంపీలతో భేటీ అవడంలో అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ సెంట్రల్ హాలులో టీడీపీ ఎంపీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. బాబ్బాబు.. ఒక్కసారి వచ్చి మా బాబు చంద్రబాబును కలవండంటూ అన్ని పార్టీల అధినేతలు, ఎంపీల వద్దకు వెళ్లి బతిమిలాడుకున్నారని విమర్శించారు. 
 
అంతేకాకుండా 'అధికార అంతమందు చూడవలేరా అయ్యగారి సొబగులు' అన్నట్టు చంద్రబాబు పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. దావోస్‌కు వెళ్లి సదస్సు పేరిట ఇడ్లీ, వడ, పొంగల్‌ పేరిట ఆంధ్ర వంటలను చంద్రబాబు ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద, కిక్కిరిసిన బస్సుల్లో నూరు, యాబై అని బ్లాక్‌టిక్కెట్టులు అమ్ముతారని, అదేవిధంగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించారన్నారు. 
 
సినిమా షూటింగ్ తరహాలో రెడీ.. క్లాప్‌.. 1, 2, 3.. అనగానే చంద్రబాబు పోజులు ఇచ్చారని, ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఈరకంగా ప్రవర్తిస్తున్న మహానుభావుడు ఆయన అని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంతలా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు. గతంలో టీడీపీ సైకిల్‌ రెండు చక్రాలు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ ఒక చక్రం, జనసేన మరో చక్రంగా వ్యవహరించిందని, అంతకుముందు కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు సైకిల్‌ చక్రాలుగా పనిచేశాయని, ఇప్పుడు రెండు చక్రాలు ఊడిపోవడంతో చక్రాలు లేని సైకిల్లా ఆ పార్టీ పరిస్థితి మారిపోయిందని అన్నారు. 
 
అందుకే కొత్త పార్టనర్ కోసం చంద్రబాబు ఢిల్లీకి వచ్చారన్నారు. అంతేకాకుండా, ఇప్పుడు ఫ్యాన్‌ బాగా తిరుగుతోందని, తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఏపీలోని 25 ఎంపీ స్థానాలనూ గెలుపొందుతుందని,150 అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుందని, తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు.