శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (11:48 IST)

అరుణ్ జైట్లీ మాటలు బాధాకరం.. కాంగ్రెస్‌కు పట్టిన గతే: చంద్రబాబు

కాంగ్రెస్‌కు పట్టిన గతే కేంద్రంలోని బీజేపీకి పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రమంత్రులుగా బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు రాజీనామాలు చేసిన అనంతరం బాబు అసెంబ్లీలో మాట్లాడుత

కాంగ్రెస్‌కు పట్టిన గతే కేంద్రంలోని బీజేపీకి పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రమంత్రులుగా బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు రాజీనామాలు చేసిన అనంతరం బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. కామినేని, మాణిక్యాలరావు రాష్ట్ర ప్రజల కోసం తమ పదవులకు రాజీనామా చేశారని.. వీరిద్దరూ గొప్పగా పనిచేశారని కొనియాడారు. 
 
ఏపీకి అన్యాయం చేయడంతోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కనబెట్టారని.. ఇదే పరిస్థితి బీజేపీకి ఏర్పడుతుందని బాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూతపెట్టి.. బిల్లు పాస్ చేశారని.. ఆ సమయంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ వ్యవహారాన్ని చూస్తుండిపోయిందని.. కాంగ్రెస్‌ను నిలదీయలేకపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనలో సహకరించి.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనక్కి తగ్గిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. 
 
కాంగ్రెస్, బీజేపీ వంటి రాజకీయ పార్టీలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. తమతమ శాఖల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా... ప్రయోజనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని బాబు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటలు తనను ఎంతో బాధించాయని చంద్రబాబు తెలిపారు. ఒక రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ ఇవ్వలేమని జైట్లీ చెప్పాడం బాధాకరమని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను కాపాడతారనే నమ్మకంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. దేశంలో కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.