బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (14:38 IST)

'పోలవరం'లో అవినీతి లేకపోతే భయమెందుకు? : బాబుకు పవన్ ప్రశ్న

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకోకుంటే నిధుల లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించేందకు ఎందుకు భయపడుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్న

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకోకుంటే నిధుల లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించేందకు ఎందుకు భయపడుతున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. 
 
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ..."పోలవరం ప్రాజెక్టు కడతామని మీరే తీసుకున్నారు. ఇప్పుడు వద్దని వెనక్కి ఇచ్చేస్తే అనుమానాలు కలుగుతాయి. కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. మీరు అవకతవకలకు పాల్పడనట్లయితే ఎందుకు భయపడుతున్నారు. అన్ని వివరాలు కేంద్రానికి సమర్పించినా... నిధులు విడుదల చేయకపోతే పోరాటం చేద్దాం" అని చంద్రబాబును కోరారు. 
 
పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తే... వచ్చే ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాదని, కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కోరారు. పోలవరంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్‌ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఏ ఒక్క ప్రభుత్వానిదో... పార్టీదో కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌ వల్ల లాభమెంతో... నష్టమెంతో పరిశీలించాలని, పునరావాస కార్యక్రమాలు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
 
పెద్ద ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించాలని ఆయన సూచించారు. పెద్ద ప్రాజెక్ట్‌ల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలు సహజమని అభిప్రాయపడ్డారు. పోలవరం ఛాలెంజింగ్‌ ప్రాజెక్ట్ అని, ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని, పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. పోలవరం కాంట్రాక్ట్‌ సంస్థకు ఉన్న అర్హతలు ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించారు.