శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:43 IST)

నాన్నా క్షమించవా... పిల్లల స్కూలు ఫీజు చెల్లించలేక వివాహిత సూసైడ్

ఆర్థిక కష్టాలు మరో వివాహితను బలితీసుకున్నాయి. కట్టుకున్నోడు వదిలి వేయడంతో పాటు తన ఇద్దరు పిల్లలకు స్కూలు ఫీజు చెల్లించలేక ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం విజయవాడ

ఆర్థిక కష్టాలు మరో వివాహితను బలితీసుకున్నాయి. కట్టుకున్నోడు వదిలి వేయడంతో పాటు తన ఇద్దరు పిల్లలకు స్కూలు ఫీజు చెల్లించలేక ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం విజయవాడ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ రామకృష్ణాపురం మొదటి లైన్‌లో నివసించే గోళ్ల సాయి ప్రియాంక (34)కు ఫొటో స్టూడియో నిర్వాహకుడు శ్రీనివాసరావుకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వివాహ సమయంలో సాయి ప్రియాంకకు పసుపు కుంకుమగా తండ్రి రామకృష్ణాపురంలో ఓ ఇల్లు రాసిచ్చారు. భార్యభర్తల మధ్య ఇంటి విషయంలో వివాదం ఏర్పడటంతో తొమ్మిది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు.
 
అయితే, భర్తతో దూరంగా ఉండటంతో పాటు పిల్లలకు స్కూల్‌ ఫీజులు కట్టేందుకు కూడా డబ్బులు లేక సాయి ప్రియాంక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పైగా, తన ఇద్దరి పిల్లల భవిష్యత్‌పై బెంగ పెట్టుకుంది. దీంతో తన ఇద్దరు పిల్లలకు పాలలో హార్లిక్స్ కలిపిచ్చి అమ్మమ్మ ఇంటికి వెళ్లి తాగాలని చెప్పి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తరువాత పిల్లలు తిరిగి వచ్చారు. ఎంతసేపటికీ తల్లి తలుపులు తీయకపోవడంతో విషయం అమ్మమ్మకు చెప్పారు. ఆమె స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే సాయి ప్రియాంక ఉరేసుకొని మృతి చెందింది. 
 
చనిపోయేముందు..  సాయి ప్రియాంక తన తండ్రికి ఓ లేఖ రాసిపెట్టింది. 'నాన్నా.. నన్ను క్షమించండి.. నేను ఆత్మహత్య చేసుకుని తప్పు చేస్తున్నాను.. నా బిడ్డల భవిష్యత్తు మీరే చూడాలి.. వివాహ సమయంలో మీరు నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఇంటిని విక్రయించి... ఆ డబ్బును నా ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడంతో పాటు బాగా చదివించి.. వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రయోజకులను చేస్తారు కదూ' అంటూ రాసిపెట్టింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.