గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (14:34 IST)

భార్య పుట్టింటికి వెళ్లిందనీ ఒకరు... పెళ్లి కాలేదనీ మరొకరు... సూసైడ్

ఇటీవలికాలంలో చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తనను వదలి భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహ

ఇటీవలికాలంలో చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తనను వదలి భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోచోట.. తనకు ఇంకా పెళ్లికాలేదన్న బాధతో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పరకాల పట్టణంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన విభూది చిన్న, కరుణ అనే దంపతులకు భరత్‌ కుమార్‌ (28), కూతురు రమ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తండ్రి విభూది చిన్న మృతి చెందగా కరుణ ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. 
 
భరత్‌ పట్టణంలోని హీరోహోండా షోరూంలో పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం జగిత్యాలకు చెందిన స్వరూపతో వివాహం జరిగింది. ఇటీవల స్వరూప, భరత్‌ల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగి స్వరూప తన తల్లిగారింటికి జగిత్యాలకు వెళ్లిపోయింది. 
 
అయితే, మంగళవారం శివరాత్రి జాగారాలు కావడంతో తల్లి కరుణ, చెల్లి రమ్య స్థానిక శివాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భరత్... ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అదేవిధంగా, రైల్వేకోడూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అన్నిరాజుల బాలరంగయ్య (42) ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప పట్టణ ప్రకాష్ నగర్‌కు చెందిన అన్నిరాజుల బాలరంగయ్య 2000లో కానిస్టేబుల్‌గా ఎంపికై, ప్రస్తుతం రైల్వేకోడూరులో విధులు నిర్వహిస్తున్నాడు. 
 
అయితే, బాలగంగయ్యకు పెళ్లి కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులు శివాలయానికి వెళ్లారు. అర్ధరాత్రి బెడ్‌రూములోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బాలరంగయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.