గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (20:46 IST)

జగన్... మీకా దమ్ము, ధైర్యం, తెగింపు వుంది... తెదేపా నిలబడుతుందో లేదో చూద్దాం: పవన్ కళ్యాణ్

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. నిన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పవన్ కళ్యాణ్ జన

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. నిన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు ఇవ్వగలరా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను తను స్వీకరిస్తున్నానని, అవిశ్వాసం పెడితే మద్దతు ఇస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ, '' జగన్ మోహన్ రెడ్డిగారూ... మీకందరికీ ముందే చెప్పాను. నేను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మీ పార్టీ సిద్ధంగా వున్నట్లు చెప్పారు.
 
ఐతే మీకు మద్దతు లేదని చెపుతున్నారు. ఆ మద్దతు నేను సంపాదిస్తా. ఐతే అంతకన్నా ముందు మనం ఇంకొకటి చేయాలి. పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం ఒక్క ఎంపీ అయినా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే వీలుంది. ముందు మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి. బలాన్ని నేను సమీకరిస్తా. మీరు ఎంతో బలమైన నాయకులు. దమ్మూ, ధైర్యం, తెగింపు వుంది. మీరు చేయగలరన్న నమ్మకం నాకుంది.
 
మీరు అవిశ్వాస తీర్మానం నోటీసును సెక్రటరీ జనరల్‌‌కి ఇవ్వొచ్చు. వీలు చూసుకుని మార్చి 4 లోపు మీరు నోటీసు ఇస్తే బలం ఎలా సమకూర్చాలో నేను ప్రయత్నం చేస్తాను. మార్చి 4న నేను ఢిల్లీ వచ్చి సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ ఆద్మీ, తెదేపా తదితర పార్టీలకు చెందిన ఎంపీలందరి మద్దతు కోరుతా. మీరు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై 5న పార్లమెంటులో చర్చ జరుగుతుంది. ఆంధ్రకు అన్యాయం జరిగిందని మొన్న తెలంగాణ ఎంపీ కవిత కూడా సభాముఖంగా తెలిపారు. తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు ఇస్తారు. నాకు తెలిసినంతవరకూ కనీసం 80 మంది ఎంపీల మద్దతు మనకు లభిస్తుంది. 
 
తెదేపా నా భాగస్వామి అన్నారు కదా. చూద్దాం... వాళ్లు నేను అడిగినట్లు మద్దతు ఇస్తారో లేదో. మీరు కూడా చూస్తారు కదా. అవిశ్వాస తీర్మానంపై మీరేమీ వెనక్కి వెళ్లాల్సిన పనిలేదు. మీకు అండగా మేముంటాం. ఇదే ఆఖరి సమావేశం కావచ్చు. వచ్చే సమావేశం అంతా వేరే దానిపై వుంటుంది. ఎన్నికల సమీపిస్తున్నాయి కనుక ఇక అవిశ్వాసానికి అవకాశం వుండదు. ఇది మీ ఒక్క పార్టీ సమస్య కాదు... ఆంధ్ర ప్రజల సమస్య. కాబట్టి మీరు వెనువెంటనే అవిశ్వాసంపై తీర్మానం నోటీసును ఇవ్వండి'' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.