1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (07:06 IST)

మోడీ తలతిక్క నిర్ణయాలతో కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ

దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ అనూహ్యంగా పెరిగిపోయింది. జులైలో అతి తక్కువ స్థాయి.. అంటే 0.9 శాతం నమోదైన సూచీ.. ఆగస్టుకు వచ్చేసరికి అది ఒక్కసారిగా 4.3 శాతానికి పెరిగింది.

దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ అనూహ్యంగా పెరిగిపోయింది. జులైలో అతి తక్కువ స్థాయి.. అంటే 0.9 శాతం నమోదైన సూచీ.. ఆగస్టుకు వచ్చేసరికి అది ఒక్కసారిగా 4.3 శాతానికి పెరిగింది. అడ్డగోలు నిర్ణయాలతో ఆర్థిక రంగాన్ని కుదేలు చేసి.. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటోన్న ప్రధాని మోడీ... ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా మళ్లీ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా తొలుత విపక్ష పార్టీలపై ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. 
 
ముఖ్యంగా, కింద పడ్డా గెలుపు తనదేననే స్వభావమున్న ప్రధాని మోడీ.. తాజాగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధినీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు నానా అవస్థలూ పడుతుంటే, 2016-17 సంవత్సరపు మూడో త్రైమాసికపు గణాంకం 7 శాతాన్ని చూపి.. జీడీపీపై విపక్షాలను దులిపేశారు. అంతేనా, నోట్ల రద్దును గొప్పచర్యగా సమర్థించుకున్నారు. ఆ తర్వాత, అదే సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1 శాతం, అనంతరం 5.7 శాతం జీడీపీ నమోదయ్యాక గానీ, మోడీ మెట్టుదిగలేదు. 
 
జీడీపీ తగ్గుదల కేవలం తాత్కాలికమేనని, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయనీ వితండ వాదనలు చేస్తూనే, గతంలో రద్దు చేసిన ఆర్థిక సలహా మండలి పునరుద్ధరణలాంటి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అయితే, ఈ చర్యలన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగానే ఉన్నయన్నది విశ్లేషకుల భావన. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆగస్టు మాసపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.3 శాతం నమోదు కావడం, మోడీకి, మునిగేవాడికి గడ్డిపోచ దొరికిన చందమేనన్న భావన వ్యక్తమవుతోంది.