శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:58 IST)

అబూ సలేంకు ఉరిశిక్ష ఎందుకు విధించలేదంటే...

ముంబై మహానగరంలో గత 1993 సంవత్సరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముంబై టాడా కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేంకు య

ముంబై మహానగరంలో గత 1993 సంవత్సరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ముంబై టాడా కోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేంకు యావజ్జీవ కారాగారశిక్ష విధించగా, మరో ఇద్దరికి పదేళ్ళ జైలుశిక్షను విధించింది. 
 
అయితే, 257 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ముంబై వరుస పేలుళ్ళ కేసులో కీలక సూత్రధారుల్లో ఒకరైన అబూ సలేంకు ఉరిశిక్ష పడకుండా యావజ్జీవ శిక్ష మాత్రమే పడింది. దీనికి కారణం లేకపోలేదు.  
 
బాంబే వరుస పేలుళ్ళ  తర్వాత నిందితులంతా దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో అబూసలేం పోర్చుగల్ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. ఆపై నటి మోనికా బేడీతో సహజీవనం చేశాడు. వీరిద్దరినీ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేసిన అనంతరం, పోర్చుగల్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత అధికారులు వారిద్దరినీ స్వదేశానికి తీసుకొచ్చారు. 
 
పోర్చుగల్‌‍ దేశ చట్టాల ప్రకారం ఎలాంటి నేరానికైనా మరణదండన అమలు చేయరు. పైగా, అబూసలేంను అప్పగించే వేళ, అతనికి మరణదండన విధించబోమని భారత్ హామీ ఇచ్చింది. ఈ కారణంతోనే అతనికి యావజ్జీవ శిక్షతోనే సరిపెట్టాల్సి వచ్చిందని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వివరించారు. 
 
కాగా 1993లో ముంబై మహా నగరంలో వరు బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1993లో 47 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ కేసును విచారించిన ముంబైలోని టాటా ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. 
 
దోషులుగా తేలిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దల్లా రషిద్‌లకు ఉరిశిక్ష విధించింది. అలాగే అబూ సలేంకు జీవిత ఖైదు విధించింది. ఆయుధాలు సరఫరా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీముల్లాఖాన్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది.