శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (08:48 IST)

మేఘాలయాలోనూ కాంగ్రెస్‌కు భంగపాటు... బీజేపీ కన్నుసన్నల్లో సర్కారు

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి మరోమారు భంగపాటుఎదురైంది. అచ్చం గోవా తరహాలోనే ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీ చాకచక్యంగా పావులు కదపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి మరోమారు భంగపాటుఎదురైంది. అచ్చం గోవా తరహాలోనే ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీ చాకచక్యంగా పావులు కదపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కాంగ్రెస్ మాజీ నేత, లోక్‌సభ మాజీ స్వీకర్ పీఏ సంగ్మా కుమారుడే ఇపుడు మేఘాలయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరుగగా, ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 21 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటులో భంగపాటు తప్పలేదు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 19 స్థానాలను కైవసం చేసుకోగా.. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ పార్టీ (యూడీపీ), బీజేపీ, హెచ్‌ఎస్ పీడీపీ, పీడీఎఫ్ తోపాటు.. ఒక స్వతంత్ర అభ్యర్థి కాన్‌రాడ్‌కు మద్దతిచ్చారు. కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించింది.
 
బీజేపీ వ్యూహకర్త హిమవంత్‌ బిస్వ శర్మ కన్వీనర్‌గా ఉన్న ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ) 34 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టింది. ఎన్‌పీపీకి యూడీపీ మద్దతు కూడగట్టడంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కీలక పాత్ర పోషించారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలిసిన అనంతరం పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రాడ్‌ సంగ్మా మీడియాతో మాట్లాడుతూ, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రానున్న రెండు రోజులు తమకు అత్యంత కీలమని పేర్కొన్నారు. ఆరోతేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరోమారు నిరాశే తప్పలేదు.