బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 31 ఆగస్టు 2017 (17:35 IST)

అయ్యా... నాకది కావాలి... కేంద్ర ఎన్నిక కమిషన్ ముందు దినకరన్

అన్నాడిఎంకే పార్టీ నుంచి శాశ్వతంగా శశికళ, దినకరన్‌లను పంపించేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే దినకరన్ మాత్రం ఆ పార్టీ గుర్తు కోసం పాకులాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అన్నాడిఎంకే అంటేనే రెండాకుల గుర్తు. ఆ గుర్తు కనబడితే జనం ఓట్లు గుద్దేస్తారు

అన్నాడిఎంకే పార్టీ నుంచి శాశ్వతంగా శశికళ, దినకరన్‌లను పంపించేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే దినకరన్ మాత్రం ఆ పార్టీ గుర్తు కోసం పాకులాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అన్నాడిఎంకే అంటేనే రెండాకుల గుర్తు. ఆ గుర్తు కనబడితే జనం ఓట్లు గుద్దేస్తారు. అందుకే దినకరన్ ఆ గుర్తు కోసం చేస్తున్న ప్రయత్నం తమిళ ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. 
 
పళణిస్వామి, పన్నీరుసెల్వంల కలయిక తరువాత దూకుడు పెంచిన దినకరన్ ఆ తరువాత అన్నాడిఎంకే ఎమ్మెల్యేలందరినీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. 21మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు దినకరన్ పళణిస్వామి ప్రభుత్వాన్నే పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పక్కనబెడితే మరోవైపు రెండాకుల గుర్తు కోసం ప్రస్తుతం ఇద్దరు పోటీ పడుతున్నారు. పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయగా దినకరన్ మాత్రం ఏకంగా ఢిల్లీ వెళ్ళి కమిషన్‌ను కలిసి రెండాకుల గుర్తు ఇవ్వమని అభ్యర్థించాడు.
 
రెండాకుల గుర్తు తనదేనన్న ధీమాలో దినకరన్ ఉంటే తమని కాదని ఆ గుర్తును దినకరన్‌కు ఇచ్చే అవకాశమే లేదంటున్నారు ఓపిఎస్, ఇపిఎస్‌లు. కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం ఇద్దరు వినతులను విని గుర్తు ఎవరికి కేటాయించాలా అన్న విషయంపై చర్చిస్తోంది. గతంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే డబ్బులు ఎరచూపిన దినకరన్‌కు  ఆ గుర్తు రాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.