శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (11:08 IST)

కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రణబ్ ముఖర్జీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొచ్చారు. 132 యేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దంటూ మోడీక

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొచ్చారు. 132 యేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దంటూ మోడీకి పరోక్ష సంకేతాలు పంపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 132 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీని తక్కువగా అంచనా వేయకూడదని, తప్పకుండా మళ్లీ లేచి నిలబడుతుందని నొక్కి వక్కాణించారు. "ప్రజలను భయపెట్టకూడదు" అంటూ పెద్ద నోట్ల రద్దుపై వ్యాఖ్యానించారు. "జీఎస్టీని మొదట నేనే ప్రతిపాదించాను. దాని అమలులో కొన్ని బాలారిష్టాలు ఉండవచ్చు. మొత్తానికి జీఎస్టీ మంచిదే" అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలను కూడా ప్రణబ్‌ తనదైన శైలిలో విశ్లేషించారు. ‘‘యూపీఏ-1ను చాలా బాగా నడిపించాం. భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. యూపీఏ-2 విషయంలో అలా జరగలేదు. సంకీర్ణ పాలన సరిగ్గా సాగలేదు. కాంగ్రెస్‌ ఎప్పుడూ 200 సీట్లు గెలిస్తే చాలు. అవే 280 సీట్లకు సమానమని, మిగతా పక్షాలన్నీ తమకే మద్దతు ఇస్తాయని అనుకునేది. అందుకే కాంగ్రెస్‌ పతనం అంచున నిలబడింది. 2012లో మమతా బెనర్జీ యూపీఏ నుంచి బయటకు వెళ్లిపోవడం కూడా మరో కారణం. మమతతో వ్యవహారం కష్టమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయినా ఆమె వద్ద 19 మంది ఎంపీలున్నారు. ఎంతకష్టమైనా ఆమెను వదులుకోకూడదు’’ అని ప్రణబ్‌ తెలిపారు. 
 
'కింది స్థాయి నుంచి కాంగ్రెస్‌ నేతలు పంపిన తప్పుడు నివేదికలు కూడా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించాయి. పరిస్థితులు చేయిదాటి పోయేలా ఉన్నాయని మన్మోహన్‌, సోనియాలు చెబుతూనే ఉన్నా తనను కలిసిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి 160-170 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 180 వరకూ వస్తాయని అంచనా వేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.