శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (08:29 IST)

రాజేష్ మైకంలోపడి భర్తను చంపేసుకున్నా... స్వాతి

ప్రియుడు రాజేష్ మాయలో పడిపోయి.. అతను చెప్పినట్టే తాను నడుచుకున్నాననీ నాగర్‌కర్నూల్‌లో భర్తను చంపిన కేసులో నిందితురాలైన భార్య స్వాతి బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది.

ప్రియుడు రాజేష్ మాయలో పడిపోయి.. అతను చెప్పినట్టే తాను నడుచుకున్నాననీ నాగర్‌కర్నూల్‌లో భర్తను చంపిన కేసులో నిందితురాలైన భార్య స్వాతి బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. రాజేష్‌ మాటలు నమ్మి తన భర్తను అన్యాయంగా చంపుకున్నానంటూ విలపించింది. అతని మైకంలో ఉండి అతను చెప్పినట్లే చేశానంది. అంతా సినిమాలో మాదిరిగా జరిగిపోతుందని భావించానని పేర్కొన్నట్లు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు కేంద్రంలో ప్రియుడి సాయంతో భర్త సుధాకర్ రెడ్డిని భార్య స్వాతి చంపిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ  హత్యకేసులో రెండో నిందితురాలు, మృతుని భార్య స్వాతిని నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసులు మరోమారు విచారించారు. 
 
శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి ఉదయం 10.30 గంటలకు అదుపులోకి తీసుకొన్న పోలీసులు 11.30 గంటలకు నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఠాణాలో పోలీసులు సుమారు 5 గంటల పాటు ప్రత్యేక గదిలో విచారించారు. హత్యకు సంబంధించి పోలీసులు స్వాతిపై ప్రశ్నలు సంధించి జవాబులు రాబట్టారు. 
 
రాజేష్‌ మాటలు నమ్మి తన భర్తను అన్యాయంగా చంపుకున్నానంటూ పోలీసుల విచారణలో ఆమె కన్నీరు కార్చింది. అతని మైకంలో ఉండి అతను చెప్పినట్లే చేశాని తెలిపింది. అంతా సినిమాలో మాదిరిగా జరిగిపోతుందని భావించాననీ తెలిపింది. కానీ తమ ప్లాన్ తల్లకిందులైందని చెప్పింది. 
 
కాగా, విచారణ అనంతరం హత్యరోజున స్వాతి ధరించిన దుస్తులు, వినియోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్‌రెడ్డిని తలపై గట్టిగా రాడ్‌తో కొట్టడంతో రక్తం వచ్చింది. ఈ రక్తాన్ని తుడిచిన దుస్తులను స్వాతి ఇంట్లోని బీరువా నుంచి తీసుకొచ్చారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి బీరువాను తెరిపించి అక్కడ దాచిన దుస్తులను తీసుకొచ్చి కోర్టుకు అందజేశారు. అనంతరం స్వాతిని కోర్టు ఎదుట హాజరుపరిచి మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించారు.