గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (16:25 IST)

తెరాస గూటికి మోత్కుపల్లి నర్సింహులు...?

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మోత్కుపల్లి నర్సింహులు అధికార తెరాస పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మోత్కుపల్లి నర్సింహులు అధికార తెరాస పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు మోత్కుపల్లి ఎంట్రీకి సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ నేతల్లో మోత్కుపల్లి ఒకరు. మాజీ మంత్రి, రాష్ట్రంలో దళిత వర్గాల్లో బలమైన పట్టుగల నేత. ఈయన ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనిపించుకోడం కంటే టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమే మంచిదన్నారు. ఇవే పెను వివాదాస్పదంగా మారాయి. 
 
తెలంగాణ ఉద్యమకాలం నుంచి నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఒకేసారి తన పంథాను మార్చుకుని అధికార పార్టీకి సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం వెనుక తన రాజకీయ భవిష్యత్‌కు గట్టి హామీ లభించినట్లు ప్రచారమవుతోంది.
 
అదేవిధంగా మోత్కుపల్లి చేరికతో అధికార టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో బలమైన మాదిగ సామాజిక వర్గంలో పట్టు లభిస్తుందని, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నేపథ్యంలో మందకృష్ణ మాదిగ ఆందోళనలకు చెక్‌ పెట్టడానికి రాజకీయ ఎత్తుగడలో భాగమే ఈ వ్యాఖ్యల వెనుక మర్మమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
 
టీడీపీ ఆవిర్భావంలో విద్యార్థిగా రాజకీయ అరంగేట్రం చేసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో కీలక మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించిన మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్‌గా పంపించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరకపోవడం, కనీసం రాజ్యసభ సభ్యత్వమైన కల్పించాలన్న ఆయన అభ్యర్థనకు సానుకూల స్పందన లేకపోవడంతో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. 
 
అదేసమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టుతో మాదిగ సామాజిక వర్గంలో అధికార టీఆర్‌ఎస్‌పై వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతకు చెక్‌ పెట్టడానికి అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు అవసరమని భావించిన సీఎం కేసీఆర్‌.. మోత్కుపల్లి చేరికకు సానుకూలంగా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మోత్కుపల్లికి టీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పించడంతో పాటు రాజ్యసభకు పంపిస్తామనే హామీ రావడంతోనే ఆయన ఈసంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్నారు.