శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2018 (08:59 IST)

ఈ జ్యోతి.. మరో స్వాతి.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది...

తెలంగాణ రాష్ట్రంలో మరో స్వాతి గుట్టు వెలుగు చూసింది. అయితే, ఈమె పేరు స్వాతి కాదు. జ్యోతి. ప్రియుడిమీద వ్యామోహంతో భర్తను నిద్రలోనే మట్టుపెట్టింది. నిద్రమాత్రలిచ్చి.. తలపై రాడ్‌తో మోది.. దిండుతో ముఖాన్న

తెలంగాణ రాష్ట్రంలో మరో స్వాతి గుట్టు వెలుగు చూసింది. అయితే, ఈమె పేరు స్వాతి కాదు. జ్యోతి. ప్రియుడిమీద వ్యామోహంతో భర్తను నిద్రలోనే మట్టుపెట్టింది. నిద్రమాత్రలిచ్చి.. తలపై రాడ్‌తో మోది.. దిండుతో ముఖాన్ని అదిమిపట్టి హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడవేసి ఏమీ తెలియనట్టు నాటకమాడింది. అయితే, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తీగలాగితే డొంక కదిలింది. ఈ దారుణం కూడా తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా హైదరాబాద్‌ శివారుల్లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన కార్పెంటర్ నాగరాజు తన భార్య జ్యోతితో వలసవచ్చి హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఐదేళ్ళ క్రితం వివాహమైన వీరికి పాప(4), బాబు(1) ఉన్నారు. నాచారంలోని మేనమామ ఇంటికి వచ్చివెళ్తున్న క్రమంలో జ్యోతికి పెళ్లికి ముందే స్థానికంగా ఉంటున్న కార్తీక్‌తో వివాహేతర సంబంధం ఉండేది. అయితే, నాగరాజుతో అయిష్టంగానే సంసారజీవితాన్ని నెట్టుకొస్తున్న జ్యోతి... కార్తీక్‌పై వ్యామోహాన్ని మరింతగా పెంచుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడు కార్తీక్‌తో చెప్పింది. దీంతో అతనితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. 
 
ఈపథకంలో భాగంగా, డిసెంబరు 30వ తేదీన రాత్రి భోజనంలో జ్యోతి నిద్రమాత్రలు కలిపి నాగారాజుకు వడ్డించింది. అది ఆరగించిన నాగరాజు నిద్రలోకి జారుకోగానే కార్తీక్‌కు ఫోన్‌చేసి పిలిపించి... వారిద్దరూ కలిసి నాగరాజును హత్య చేశారు. ఆ తర్వాత కార్తీక్ తన స్నేహితులు దీపక్, యాసిన్, నరేశ్ సహాయంతో మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నల్లగొండ జిల్లా అంకిరెడ్డిగూడెం జిల్లేడు చెల్క ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. 
 
ఈ ప్రాంతంలో ఓ మృతదేహం పడివుండటాన్ని స్థానికులు 31వ తేదీ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చౌటుప్పల్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అతడి జేబులో ఉన్న చీటి ఆధారంగా భార్య జ్యోతికి సమాచారమిచ్చారు. ఆమె ఏమీ తెలియనట్టుగా అక్కడకు వెళ్లి మృతదేహం తన భర్తదేనని బోరున విలపిస్తూ చెప్పింది. పైగా, రెండురోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని పోలీసులకు వివరించింది. 
 
దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఇందులో నాగరాజు చనిపోవడానికి అతడి తలపై గాయం కావడం ఒక కారణమని తేలింది. దీంతో అనుమానించిన పోలీసులు, వెంటనే చౌటుప్పల్ పోలీసులు నాగరాజు ఫోన్ నంబర్‌ను విశ్లేషించగా, అతడి ఫోన్ ఇంట్లోనే స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు. 
 
అనుమానం బలపడిన పోలీసులు భార్య జ్యోతి నంబర్‌పై ఆరాతీయగా నాగరాజు ఫోన్ ఆఫ్ అయిన సమయంలోనే గుర్తుతెలియని నంబర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చినట్టు తేలింది. అదే నంబర్ మృతదేహం పడిఉన్న ప్రదేశంలోనూ లొకేట్ కావడంతో ఒక నిర్ధారణకు వచ్చి జ్యోతి, కార్తీక్‌లను పిలిపించి విచారించారు. దీంతో వారు హత్యవిషయాన్ని బయటపెట్టారు. ఈ కేసులో వారిద్దరితోపాటు, యాసిన్, దీపక్, నరేశ్‌ల పాత్ర ఉందని నిర్ధ్దారించారు.