శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (15:45 IST)

చేతులు కాలాక కాళ్లు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు : మోడీ - షాలపై యనమల ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పరిస్థితి ఇపుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పరిస్థితి ఇపుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్నారు. మోడీ, అమిత్ షా అహంభావంతో పార్టీ అగ్రనేతలైన ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను అగౌరవపరిచారని అన్నారు. ఇప్పుడేమో వాళ్ల ఇళ్లకు వెళ్లడం, శివసేన, అకాలీదళ్ పార్టీల చుట్టూ మోడీ, అమిత్ షాలు ప్రదక్షిణాలు చేయడం చూస్తుంటే బీజేపీ ఎలాంటి దుస్థితిలో ఉందో అర్థమవుతుందన్నారు.
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకే కాదు తన భాగస్వామ్య పక్షాలకూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని యనమల మండిపడ్డారు. ముఖ్యంగా, ఎన్డీయే కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ వంటి పార్టీలు బయటకు వచ్చాక గానీ వారిద్దరికీ మిత్రపక్షాల విలువేంటో తెలియరాలేదన్నారు. 
 
మిత్రపక్షాలకు ద్రోహం చేసిన మోడీ, అమిత్ షాలు ఇప్పుడు మళ్లీ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇక, తమకు పుట్టగతులుండవని చెప్పి నష్ట నివారణా చర్యలు చేపట్టారంటూ మోడీ, అమిత్ షాలను దుయ్యబట్టారు. 
 
ఇకపోతే, లౌకికవాదం ఎంత ప్రమాదంలో ఉందో బిషప్‌లే చెప్పారన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాతీర్పును కాలరాయాలని చూశారన్నారు. కైరానా ఎంపీ స్థానం ఉపఎన్నిక ఫలితమే దానిని ఎండగట్టిందని చెప్పారు. ప్రజలకే కాదు భాగస్వామ్య పక్షాలకూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. స్వయంకృతాపరాధం వల్లే బీజేపీ ఒంటరిగా మిగిలిందని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
 
ఇకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల డ్రామా క్లైమాక్స్‌కు చేరిందన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి ఆడిన రాజీ డ్రామా ప్రజాస్వామ్యానికే మాయని మచ్చన్నారు. ఉప ఎన్నికలు రావని తేలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలాడారని మంత్రి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలంటేనే వైసీపీకి భయమని మంత్రి అన్నారు.