శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (07:27 IST)

కాంగ్రెస్ తల్లిని చంపేసిందన్నారు.. ఇపుడు మీరూ అదే చేశారు : మోడీపై చంద్రబాబు

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డకు పురుడు పోసిందంటూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నాడు నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నాడు సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డకు పురుడు పోసిందంటూ ప్రధానమంత్రి అభ్యర్థిగా నాడు నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నాడు సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. 
 
బుధవారం రాత్రి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని, తాము అధికారంలో ఉండి ఉంటే ఇద్దరినీ బతికించే ఉండేవాళ్లమని నాడు నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు కూడా తల్లిని చంపేస్తారా? అని మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అర్థరాత్రి వరకు ఊరించి ప్రత్యేక హోదా ప్రకటించారని, ఏడాది దాటినా అందుకు సంబంధించిన నిధుల ప్రస్తావనే లేదన్నారు. ఏపీకి రావాల్సిన నిధులలో ఈ నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14 ఆర్థిక సంఘం చెప్పలేదని సీఎం గుర్తు చేశారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని బీజేపీకి సూచించారు.
 
ఇకపోతే, ప్రత్యేక హోదా విషయంలో గతంలో రాజీ పడ్డానన్న అభిప్రాయం సరికాదు. దేశంలో ఎవరికీ ఇవ్వడంలేదన్నప్పుడు మాత్రమే సర్దుకుపోయి, ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు పొడిగిస్తున్నారని తెలిసి.. గట్టిగా హోదా కోసం పట్టుపట్టాం. ప్రత్యేక హోదా ఇస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక మాట అని సరిపెడితే కుదరదు. ఆ హోదాలో ఏమేం ఉంటాయో స్పష్టంగా ప్రకటించాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.