మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (15:35 IST)

త్రిపురలో ఎర్రకోట బద్ధలు.. త్వరలో వామపక్ష ముక్త భారత్ : రవిశంకర్

త్రిపుర రాష్ట్రంలో ఎర్రకోట బద్ధలైంది. శనివారం వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో గత 25 యేళ్లుగా కొనసాగుతూ వచ్చిన సీపీఎం ప్రభుత్వ పాలనకు తెరపడింది.

త్రిపుర రాష్ట్రంలో ఎర్రకోట బద్ధలైంది. శనివారం వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో గత 25 యేళ్లుగా కొనసాగుతూ వచ్చిన సీపీఎం ప్రభుత్వ పాలనకు తెరపడింది. మొత్తం 60 అసెంబ్లీ సీట్లకుగాను 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఇందులో మొత్తం 41 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, అధికార సీపీఎం పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఫలితంగా త్రిపుర కోటపై కాషాయపు జెండా ఎగురనుంది. 
 
ముఖ్యంగా, రెండున్నర దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన లెఫ్ట్ ఫ్రెంట్‌ పానలకు చరమగీతం పాడి, బీజేపీ మూడింట రెండు వంతుల ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ అగ్రనేతలు సైతం లెఫ్ట్‌ ఫ్రెంట్‌ను గద్దెదింపుతూ ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఉబ్బితబ్బిబ్బులైపోతున్నారు. 
 
ఈ ఫలితాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ మీడియాతో మాట్లాడుతూ 'కాంగ్రెస్ ముక్త్ భారత్‌తో పాటు ఇప్పుడు వామపక్ష ముక్త్ భారత్‌కూడా సాకారమవుతోంది' అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈశాన్యమంతా బీజేపీతోనే ఉందని, మొదట్లో కాంగ్రెస్ ముక్త్ భారత్ అని తాము నినదిస్తూ వచ్చామని, ఇప్పడు 'వామ్ పంత్ ముక్త్ భారత్' (వామపక్ష ముక్త భారత్) కూడా కనుచూరుమేరలోనే కనిపిస్తోందన్నారు.