శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (12:18 IST)

దక్షిణాది సొమ్ముతో ఉత్తరాదికి సోకులు : దక్షిణాది సెంటిమెంట్‌ లేవనెత్తిన చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. దక్షిణాది సొమ్ముతో ఉత్తరాదికి సోకులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి చెల్లించే పన్

కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. దక్షిణాది సొమ్ముతో ఉత్తరాదికి సోకులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి చెల్లించే పన్నులు దక్షిణాది రాష్ట్రాల నుంచే అధిక మొత్తంలో వస్తున్నాయనీ, ఆ పన్నులన్నీ తీసుకెళ్లి ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారనీ ఆయన విమర్శలు గుప్పించారు. 
 
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శానసమండలిలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన 18 హామీలను అమలు చేయాల్సిందే అని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ తీరును దునుమాడారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరమని... ఆ తర్వాత రాష్ట్రంపై చిన్నచూపు చూస్తుంటే మరింత బాధ వేస్తోందని అన్నారు. జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోరాదని, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీలా చేస్తే ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. 
 
సెంటిమెంట్‌తో నిధులు రావని కేంద్ర విత్తమంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ఏం... తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని ఆయన నినందించారు. ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారు. అందుకే కేంద్రం నుంచి వైదొలిగాం. కేంద్రంలో పదవుల కోసం టీడీపీ ఎప్పుడూ ఆరాటపడలేదని స్పష్టం చేశారు. 
 
హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరు? ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టం చేశారు. కేంద్రం చట్టాన్ని గౌరవించాలి. హామీలను నిలబెట్టుకోవాలి. రాష్ట్రాన్ని అహేతుకంగా విభజించారు కాబట్టి... హోదా అనేది ఒక హక్కు. హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎదురుదాడి చేయడం సరికాదనీ, కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ మాటలే చెబుతోందని మండిపడ్డారు. 
 
కాగా, ఇటీవలే తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహాలో కేంద్రంపై విమర్శల దాడికి దిగిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు ఇచ్చామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనపై ఆయన విలేకరుల సమావేశంపెట్టిమరీ కేంద్రం తీరును తూర్పారబట్టారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో ఇచ్చే మొత్తంలో కనీసం 50 శాతం కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదంటూ పూర్తి గణాంకాలను వివరించారు. దీంతో బీజేపీ నేతలు కుక్కిన పేనులా నోరెత్తకుండా మిన్నకుండిపోయారు. మొత్తంమీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ దక్షిణాది సెంటమెంట్‌ను తెరపైకి తీసుకరావడం ఇపుడు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.