శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (18:26 IST)

సుప్రీం జడ్జీల తిరుగుబాటు.. ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ప్రధాని కార్యాలయం కోరింది. న్యాయ చరిత్రలో తొలిసారి న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు ఉన్నారు. 
 
అంతకుముందు నలుగురు జడ్జీలు మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో కొన్ని నెలలుగా అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయి. పరిపాలన వ్యవహారాలు సరైన పద్ధతిలో జరగటం లేదు. వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. నాలుగు నెలలు క్రితం కొలీజియంలోని నలుగురు జడ్జీల సంతకాలతో లేఖ రాశాం. 
 
అయినా పరిపాలన వ్యవస్థలో మార్పు లేదు. మా ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నాం. మీడియా ముందుకు వచ్చాం. మా ఆవేదనను బహిరంగంగా వెల్లడించాలని నిర్ణయించుకున్నాం. సుప్రీంకోర్టులో పరిపాలన, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. కొలీజియంపై చీఫ్ జస్టిస్‌ను ఒప్పించలేకపోయాం అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే మీడియా ముందుకు వచ్చాం అన్నారు.
 
పైగా, సుప్రీంకోర్టులో పరిపాలన సరిగా లేదు. అది మాపై ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్‌లో ఈ జడ్జీలు ఎందుకిలా చేశారు.. ఈ వ్యవస్థ ఎందుకిలా తయారు అయ్యింది అని ఎవరూ అనుకోకూడదు. కేసుల విషయంలో ఈ తీర్పులు ఏంటీ అని దేశ ప్రజలు అనుకోకూడదు. ఓ కేసు విషయంపై మేం.. మా అభిప్రాయాలను లేఖ రూపంలో చీఫ్ జస్టిస్‌కు తెలియజేశాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక.. సమస్య ఇక పరిష్కారం కాదేమో అని భయపడి.. విధిలేని పరిస్థితుల్లో.. దేశ ప్రజలకే వాస్తవాలను వివరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రకటించారు.